
జూన్ నెల కూడా ముగిసిపోతోంది. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. ప్రవేశించిన రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవడం లేదు. అన్నదాతలు, ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నారు. వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఉందని.. ఈ కారణంగా వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా వార్నింగ్ ఇచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలమైన మౌలిక అంశాలతో ముందుకు సాగుతున్నప్పటికీ.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోతే వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జూన్ బులెటిన్లో ప్రచురించిన ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ వ్యాసం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇంకా సున్నితంగానే ఉన్నాయని, పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాలు పూర్తిగా తొలగిపోలేదని ఆ వ్యాసం వెల్లడించింది.
“అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కొంత ఊరటనిచ్చినప్పటికీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి” అని వ్యాస రచయితలు పేర్కొన్నారు. ఈ ఒప్పందం విఫలమైతే ద్రవ్యోల్బణ అంచనాలు పెరగడం, ఇంధన మౌలిక సదుపాయాలకు అంతరాయం కలగడం, పెట్టుబడుల ఆలస్యం, ఆహార భద్రత సమస్యలు, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం వంటి అనేక ప్రమాదాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడుల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపింది.
అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలకు సంబంధించిన అధిక-ఆవృత్తి (హై-ఫ్రీక్వెన్సీ) సూచికలు కూడా ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయని సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొంది. మే నెలలో ద్రవ్యోల్బణం కొంత పెరిగినప్పటికీ.. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పటికీ నియంత్రణలోనే ఉందని వెల్లడించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ప్రవాహం, తగిన విదేశీ మారక నిల్వల కారణంగా భారత బాహ్య రంగం కూడా స్థిరంగా ఉందని ఆర్బీఐ విశ్లేషించింది. “ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశం బలమైన ఆర్థిక పునాదులతో ఈ సంక్షోభ పరిస్థితుల్లోకి ప్రవేశించింది. అందువల్ల బాహ్య షాక్లను తట్టుకునే సామర్థ్యం భారత్కు ఎక్కువగా ఉంది” అని వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితల వ్యక్తిగత విశ్లేషణ మాత్రమేనని, అవి రిజర్వ్ బ్యాంక్ అధికారిక అభిప్రాయాలుగా పరిగణించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.