
Perni Nani: సాయికృష్ణ కేసులో సిట్ విచారణపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించిన ఆయన, ఈ కేసులో అనేక కీలక అంశాలను అధికారులు విస్మరించారని విమర్శించారు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఘటన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిస్థితిని బయటపెట్టిందని పేర్ని నాని అన్నారు. కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత కూడా శవం ఏమైందో అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్పలేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే చార్జ్షీట్ దాఖలైందని ఆరోపించారు.
సిట్ విచారణపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, మే 6న సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన విధానాలు పాటించలేదని అన్నారు. టాస్క్ఫోర్స్ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్కరేనా? శవాన్ని ఎలా తరలించారు? సీసీటీవీ ఫుటేజీ ఎందుకు మాయమైంది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవని అన్నారు. సాయికృష్ణ తల్లి పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా స్పందన రాలేదని, చివరకు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ‘రెడ్బుక్ పాలన’ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన పేర్ని నాని, లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ కేసులో సీపీ, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల పాత్రపైనా స్వతంత్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇక, సీఐ నాగరాజు ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారా? కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్ వివరాలు సేకరించారా? సాయికృష్ణ ఫోన్ ఏమైంది? నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారా? వంటి పలు ప్రశ్నలను ఆయన సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఉన్నతాధికారులను పక్కనపెట్టి పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..