Reading Time: 2 minutes
India Vs Ireland : భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్.. ఎవరీ MV.నరసింహారావు?

India Vs Ireland : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. జూన్ 26 నుంచి ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఒక అరుదైన ఆటగాడి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఐర్లాండ్ రెండు జట్ల తరఫునా ఆడిన ఒకే ఒక్క క్రికెటర్ ఎమ్‌వీ నరసింహారావు (బాబ్జీ). ఈ సిరీస్ నేపథ్యంలో ఆయన పాత రికార్డులు, ప్రస్తుత మ్యాచ్‌లపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు హైలైట్‌గా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఐర్లాండ్‌లో సెటిల్

ఎమ్‌వీ నరసింహారావు సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన అద్భుతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల పక్కా ఆల్‌రౌండర్. భారత్‌లో సుదీర్ఘ కాలం పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన ఆయన, ఆ తర్వాత కాలంలో ఐర్లాండ్‌కు వలస వెళ్లారు. అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయి స్థానిక క్రికెట్ క్లబ్‌లలో ఆడటం ప్రారంభించారు. కాలక్రమేణా ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఆడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

నరసింహారావు అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ కెరీర్

నరసింహారావు 1979 జనవరి 3న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టు తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. అయితే కేవలం పది నెలల కాలంలోనే ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. భారత్ తరఫున ఆయన ఆడింది కేవలం 4 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే. వాటిలో 46 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయంగా ఎక్కువ అవకాశాలు రాకపోయినప్పటికీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆయన రికార్డులు అమోఘం. 108 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 40.71 సగటుతో 4845 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రాణిస్తూ మొత్తం 253 వికెట్లు పడగొట్టారు.

ఐర్లాండ్ జట్టు తరఫున మైదానంలోకి..

1990వ దశకంలో ఐర్లాండ్ దేశంలో ప్రొఫెషనల్ క్రికెటర్ల కొరత తీవ్రంగా ఉండేది. ఆ సమయంలో ఐర్లాండ్‌లోనే నివసిస్తున్న నరసింహారావు ఆటతీరును గమనించిన అక్కడి మేనేజ్‌మెంట్, ఆయనను తమ జట్టు తరఫున ఆడాల్సిందిగా కోరింది. అలా 1995లో నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో నరసింహారావు ఐర్లాండ్ జట్టు తరఫున బరిలోకి దిగారు. రెండు వేర్వేరు దేశాల జెర్సీలను ధరించిన కొద్దిమంది అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో ఆయన కూడా చేరిపోయారు.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కోసం నరసింహారావు నిరీక్షణ

ప్రస్తుతం ఐర్లాండ్‌లోనే ఉంటున్న నరసింహారావు.. జూన్ 26 నుంచి జరగబోయే భారత్-ఐర్లాండ్ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టీం ఇండియా యువ సంచలనం, తుఫాన్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టీ20 సిరీస్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. అతని హిట్టింగ్ మరియు దూకుడుగా ఆడే శైలిని చూడటానికి ఐర్లాండ్ ప్రజలు సైతం ఇష్టపడుతున్నారని నరసింహారావు తెలిపారు.

చిన్న స్టేడియం.. పెరగనున్న క్రేజ్

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన నరసింహారావు.. మ్యాచ్ జరగబోయే బెల్‌ఫాస్ట్ స్టేడియం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “బెల్‌ఫాస్ట్ స్టేడియం చాలా చిన్నది, అక్కడ కేవలం 7000 మంది కూర్చునే సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ క్రేజ్ దృష్ట్యా, అక్కడ ప్రేక్షకుల సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. కేవలం ఐర్లాండ్ నుండే కాకుండా యూరప్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భారతీయులు, స్థానిక ప్రజలు బెల్‌ఫాస్ట్‌కు తరలివస్తున్నారు” అని నరసింహారావు పేర్కొన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..