
మరికొన్ని రోజుల్లో జూన్ నెల ముగియనుంది. జూలై నెల వచ్చేస్తోంది. కొత్త నెల వస్తుందంటే చాలు.. అనేక కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటారు. ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్థలు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటాయి. జూలై 1వ తేదీ నుండి అనేక ముఖ్యమైన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. దేశ ప్రజలందరిని ఇవి ప్రభావితం చేయనున్నాయి. జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పింఛనుదారులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులతో సహా కోట్లాది మంది ప్రజలు ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా కీలకం. లేకపోతే ప్రభుత్వ, బ్యాంక్ సేవలు పొందే సమయంలో ఇబ్బందుల పడాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త విషయాలు ఏంటో చూద్దాం.
ఆధార్ కార్డుదారులకు ఊరట
జూలై 1వ తేదీ నుండి మీ ఆధార్ కార్డు ఇమెయిల్ ఐడిని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జి విధించరు. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మీ ఇమెయిల్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో ఇందుకు రూ.75 రుసుమును విధించేవారు. ఇప్పుడు దీనిని తొలగించారు. జూలై 1 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
పెరగనున్న రైల్వే జరిమానాలు
జూలై 1 నుంచి రైళ్లల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. గతంలో కనీస జరిమానా రూ.250 ఉండేది. ఇప్పుడు దానిని రూ.500కు పెంచారు. ఇక ఇతరుల టిక్కెట్టుపై ప్రయాణించడం, రైలులో గొడవ చేయడం, భిక్షాటన చేయడం, అక్రమంగా వస్తువులు అమ్మడం, లేదా మహిళల కోసం కేటాయించిన కోచ్లో ప్రయాణించడం వంటి నేరాలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు.
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..?
గత నెలలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అనంతరం కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. జూలై ప్రారంభంలో ఫిక్స్డ్ డిపాజిట్ నిబంధనలు, వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోవచ్చు. బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సమీక్షించి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉంటాయి. పెట్టుబడిదారులు కొత్త ఎఫ్డీని తెరవడానికి లేదా పాతదాన్ని పునరుద్ధరించడానికి ముందు బ్యాంకు తాజా వడ్డీ రేట్లు, నిబంధనలను తనిఖీ చేయాలి.
గ్యాస్ ధరలు ఎలా ఉంటాయి..?
జూన్ ఒకటో తేదీన డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ప్రభుత్వం 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.29 పెంచింది.మార్చి 7న సిలిండర్ ధరను రూ.60 పెంచారు. జూన్ 1న మరోసారి పెంచడంతో ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుండి రూ.942కి పెరిగింది. జూలైలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడటంతో ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు
అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇది భారతదేశంలో పెట్రోల్ ధరలను కూడా ప్రభావితం చేసింది. 2026 మే నెలలో పెట్రోల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయి. మే 25న జరిగిన పెంపుతో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.46 నుండి రూ.2.95 వరకు పెరిగింది. దీనికి ముందు మే 23న రూ.0.87 నుండి రూ.1.46 వరకు పెరిగింది. అంతకు ముందు లీటరుకు రూ.0.82 నుండి రూ.1.71 వరకు ధర పెరిగింది. జూలైలో పెట్రోల్, డీజిల్ ధరలు మారవచ్చు.