
- రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు
- నిందితులు గౌస్, కార్తీక్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇద్దరు స్నేహితులు బైక్ తాళం కోసం వాగ్వదానికి దిగారు. మాట మాట పెరిగి.. గొడవ పెద్దది అయి చివరకు విషాద ఘటనతో ముగిసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని బంకమట్టి కాలనీకి చెందిన దూదేకుల అబ్దుల్లా, గౌస్, కార్తీక్లు స్నేహితులు. ఆదివారం రాత్రి అబ్దుల్లాకు చెందిన బైక్ తాళాన్ని స్నేహితులు కింద పడేశారు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన గౌస్, కార్తీక్లు.. పక్కనే ఉన్న పదునైన నాపరాళ్లతో అబ్దుల్లా తల, ఇతర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్లా, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన గౌస్, కార్తీక్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో బంకమట్టి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి