
ఐపీఎల్ లో మరో రసవత్తర పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం(అహ్మదాబాద్) వేదికగా ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జట్ల పరిస్థితి ఏంటి.?
శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్లలో మూడు విజయాలు, రెండు ఓటములతో నిలకడగా రాణిస్తోంది. గిల్ తన బ్యాటింగ్ పవర్తో జట్టును ముందుండి నడిపిస్తూ పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకెళ్లాలని పట్టుదలగా ఉన్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తడబడుతోంది. ముంబై ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ ముంబైకి కీలకం.
పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోరు టార్గెట్ ఇవ్వడం బెటర్ డెసిషన్ అని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు.
గుజరాత్ టైటాన్స్ లో గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, బౌలింగ్లో మహ్మద్ సిరాజ్, కగిసో రబడ కీలకం కానున్నారు. ముంబై తుది జట్టులోకి ఒకవేళ రోహిత్ వస్తే అతడి ఇన్నింగ్స్ కీలకం కానుంది. గత కొంతకాలంగా బ్యాటింగ్ లో తడబడుతోన్న సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల షాట్లు, బుమ్రా యార్కర్లపై అందరి కళ్లు ఉన్నాయి. మరి ముంబై ఈ సారైనా గెలుపు బాట పడుతుందా.? లేక గుజరాత్ హ్యాట్రిక్ కొడుతుందా చూడాలి.