Reading Time: 2 minutes

సూరత్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది.. 24 గంటల్లో 23 వేల మంది వలస కార్మికులు ఎందుకు వెళ్లిపోయారు.. కారణాలు ఏంటీ..?

Caption of Image.

 గుజరాత్ రాష్ట్రం సూరత్, దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా. సూరత్ కేంద్రంగా ఉన్న టెక్స్ టైల్, వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు అనేక పరిశ్రమలు ఉన్నాయి. సూరత్ ఇండస్ట్రియల్ ఏరియాలో లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో 41 లక్షల మంది వలస కార్మికులు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి.. రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. ఇటీవల పరిణామాలు వలస కార్మికులు మూడు పూటల తినటానికి తిండి కూడా దొరకటం లేదు. ఈ క్రమంలోనే 2026, ఏప్రిల్ 19వ తేదీ వేలాది మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లటానికి.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్ కు పోటెత్తారు. ఈ క్రమంలోనే సూరత్ రైల్వే స్టేషన్ వలస కార్మికులతో రద్దీగా మారింది. ప్రయాణికులను కంట్రోల్ చేయటానికి పోలీసులు ఏకంగా లాఠీఛార్జీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సూరత్ నుంచి 24 గంటల్లోనే.. 23 వేల మంది వలస కార్మికులు వెళ్లిపోయారు. ఈ దుస్థికి కారణం ఏంటీ.. ఎందుకు వలస కార్మికులు వెళ్లిపోతున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం…

గుజరాత్‌లోని సూరత్ నగరంలో నిన్న ఆదివారం ఉధ్నా రైల్వే స్టేషన్‌కు వేల మంది కార్మికులు ఒక్కసారిగా పోటెత్తారు. దింతో స్వగ్రామాలకు వెళ్ళడానికి రైలు ఎక్కేందుకు గంటల తరబడి ఎండలో వేచి చూడాల్సి వచ్చింది. చివరికి స్టేషన్‌లో రద్దీ పెరిగిపోవడంతో పోలీసులు  లాటి ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయితే కేవలం వేసవి సెలవుల వల్లే ఈ రద్దీ పెరగలేదు. దీని వెనుక మరికొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. 

వంటగ్యాస్ (LPG) కొరత: సూరత్‌లో గత కొన్ని వారాలుగా ఎల్‌పిజి సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దింతో ధరలు భారీగా పెరిగాయి. కొందరు కార్మికులు భోజనం వండుకోలేక ఆకలితో అలమటిస్తున్నారు. మరో పక్క పరిశ్రమల్లో పని తగ్గడం వల్ల ఆదాయం పడిపోయింది.  పెరుగుతున్న ఖర్చులతో సూరత్‌ నగరంలో బతకడం భారంగా మారిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

స్టేషన్ వద్ద నరకం:
బీహార్, ఉత్తరప్రదేశ్ వెళ్లే రైళ్ల కోసం ప్రయాణికులు రాత్రంతా క్యూలో నిలబడ్డారు. 15 గంటలుగా క్యూలో ఉండటం వల్ల మంచి నీరు, ఆహారం కూడా దొరకలేదని పలువురు వాపోయారు. రైలు లోపల కనీసం నిలబడటానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది.

అధికారుల వివరణ:
పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. సుమారు 23,000 మందిని తరలించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు టికెట్ కౌంటర్లు తెరిచామని, ప్రయాణికులు వదంతులు నమ్మవద్దని కోరారు. రద్దీ ఎక్కువగా ఉంటే కొద్దిరోజులు ఆగి వెళ్లాలని సూచించారు.

దేశవ్యాప్తంగా నిరసనలు:
కేవలం సూరత్ మాత్రమే కాదు.. నోయిడా, పానిపట్, గురుగ్రామ్ వంటి నగరాల్లో కూడా కార్మికులు వాళ్ళ సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారు. కనీస వేతనాలు, పెరిగిన ఖర్చుల వల్ల వలస కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న వీరికి గ్యాస్, ఆహారం వంటి కనీస అవసరాలు తీరకపోవడం గమనార్హం. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను మెరుగుపరచకపోతే ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.