
- ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 2023లోనే ఆమోదం పొందిన మహిళా బిల్లును నోటిఫై చేయకుండా కాలయాపన చేస్తూ, ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తోందని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో తమకు పూర్తి చిత్తశుద్ధి ఉందని ఆయన వెల్లడించారు. సోమవారం పార్లమెంటులో ప్రత్యేక మహిళా బిల్లును ప్రవేశపెడితే, ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు.