
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా తొలగించి అన్ని సేవలను ఆన్లైన్లో అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పోర్టల్స్ ‘వాహన్’, ‘సారథి’ ద్వారా ఒక్కొక్కటిగా ఆన్లైన్ సేవలు అందిస్తున్న రవాణా శాఖ అధికారులు.. రానున్న రోజుల్లో మొత్తం 23 రకాల సేవలను ఈ పోర్టల్స్ ద్వారా అందించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న స్లాట్ బుకింగ్ విధానానికి స్వస్తి చెప్పనున్నారు.
ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ సర్వీస్ అయినా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే అందుబాటులో ఉంటుంది. స్లాట్ దొరకకపోతే సదరు సర్వీస్ పొందడం అసాధ్యం. అనేక సందర్భాల్లో రోజుల తరబడి వేచిచూసినా స్లాట్లు దొరకవు. అయితే ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం సులభంగా స్లాట్లు దొరుకుతున్నాయి.
వారు కమీషన్లు తీసుకొని ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో స్లాట్లు బుక్ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా రవాణా శాఖ ఏజెంట్ల చేతుల్లో ఉందని భావించి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మొదటి దశలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేసి ఆన్లైన్ సేవలు ప్రారంభించింది. తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ను షోరూములకు అప్పగించింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల ప్రింటింగ్, పంపిణీని సెంట్రలైజ్ చేస్తోంది. ఇప్పుడు స్లాట్ బుకింగ్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి నేరుగా రవాణా శాఖ పోర్టల్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రవాణా సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వాహనదారులు ఏజెంట్లపై ఆధారపడే పరిస్థితి కూడా తొలగిపోనుంది.