
- 2024లోనే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర: సీఎం రేవంత్రెడ్డి
- అది మిస్సయిందనే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ముసుగులో బిల్లు
- డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అస్థిరపరుస్తామంటే కాంగ్రెస్ ఏనాటికీ ఒప్పుకోదు
- నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాలు, చర్చలు జరపాలి
- ఒక్క మహిళకు అధ్యక్ష, జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వని బీజేపీకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా?
- పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ అని వెల్లడి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఓడిపోలేదని, ఓడింది మోదీ, బీజేపీ అహంకారమేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఏనాడు అడ్డంకి, వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. 2024 లోనే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని తెలిపారు. ఆ టార్గెట్ మిస్ అయిందని.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్, సీట్ల పెంపులాంటి బిల్లులను లోక్ సభలో పెట్టిందని విమర్శించారు. అయితే, డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అస్థిరపరుస్తామంటే కాంగ్రెస్ ఏనాటికీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు.
‘‘చూసేందుకు ఈ 3 బిల్లులు వేర్వేరుగా కనిపిస్తున్నా.. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లు పెంచడానికే వీటిని తెచ్చారు. నిజంగా మహిళా బిల్లునే పాస్ చేయాలనుకుంటే.. ఇంత ప్రయాస అక్కర్లేదు. 2023లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాలనుకుంటే.. ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. కానీ.. బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లను ఎత్తివేయడమే” అని అన్నారు. 2024 లో చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని సీఎం గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పుతోపాటు రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ భావించిందని చెప్పారు. కానీ ప్రజలు జాగృతమై 240 సీట్లకే బీజేపీని పరిమితం చేశారన్నారు. ‘‘రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్లను ఎత్తివేయాలంటే బీజేపీకి 2/3 వంతుల మెజారిటీ కావాలి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు కలిసి ఓడించాయి’’ అని తెలిపారు.
బిల్లులు వీగిపోవడం కేవలం కేంద్రంలోని అధికార పార్టీ ఓటమే కాదని.. బీజేపీ, మోదీకి చిత్తశుద్ధి సరిగా లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందన్నారు. ఈ బిల్లులు వీగిపోవడానికి కారణమైన నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుంది అని బద్నాం చేసే పనిలో మోదీ, బీజేపీ పడిందన్నారు. ఇందులో భాగంగా గ్రామ గ్రామాన.. గల్లీ గల్లీలో ఆందోళనలు చేపట్టారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ తన చిత్తశుద్ధిని స్వచ్చంగా ఉంచుకోవాలని, చట్టాలను సరైన పద్ధతిలో తయారు చేయాలని హితవు పలికారు.
48 గంటలుంది.. కొత్త బిల్లు తెండి
ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా కొత్త బిల్లు తయారు చేసేందుకు అమిత్ షాకు 48 గంటల టైం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ చెప్పారు.‘‘ఒక గంటలో బిల్లు మార్చి తెస్తామని అమిత్ షా లోక్సభలో అన్నారు. మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే సోమవారం వరకు ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే మహిళా బిల్లు పార్లమెంట్ ముందుకు తీసుకురండి. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు మేం మద్దతిస్తాం. సోమవారం బిల్ పాస్ చేసుకొని..మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చు” అని తెలిపారు. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలో 2027లో ఎన్నికలు జరగనున్నాయని, యూపీతోపాటు ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో తొలిసారి ఈ మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దామని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ధి ఏంటో ఈ ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయని తెలిపారు. 2009లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో 2026 ఆగస్టు15లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే.. తెలంగాణ సీఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం రంగస్వామితో చర్చలు జరుపుతానని అన్నారు. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతానని చెప్పారు.
ప్రధాని దృష్టిలో పడాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఆరాటం..
బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే డీలిమిటేషన్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని, ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి శిక్ష విధిస్తామనడం ఏవిధంగా సరైందని ప్రశ్నించారు. ‘‘తల్లిని చంపి బిడ్డను రక్షించారు..తలుపులు మూసి విభజన చేశారు’ అని తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ పలుమార్లు ద్వేషం చూపారని.. ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని ఫైర్ అయ్యారు.
మోదీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్ పొందేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నారు తప్ప.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ భజనతో మోదీ ఇచ్చే పదవులు పొందొచ్చుగానీ, డీలిమిటేషన్లో సౌత్కు సీట్లు తగ్గితే వీళ్లకు పోటీ చేసేందుకు చాన్స్ ఉండాలి కదా అని ప్రశ్నించారు. తాను సూచించిన విధానం కిషన్రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పుడున్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే.. అవసరమైతే తన సీటు కూడా త్యాగం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. పార్టీ లీడర్గా తన సీటును పార్టీ మహిళలకు గర్వంగా ఇస్తానని చెప్పారు.
మాకు దేశం ఫస్ట్
కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ మోదీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని విమర్శించారు. ఇలాంటి ఆలోచనతో ఉత్తర, దక్షిణాల మధ్య అంతరాలు సృష్టించి అడ్డుగోడలు పెట్టొదని మోదీరి, బీజేపీకి హితవు పలికారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని, దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని అన్నారు.
దేశసేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని తెలిపారు. డీలిమిటేషన్కు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణులతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి లోక్సభ నియోజ కవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని అన్నారు.
కాంగ్రెస్తోనే మహిళా సాధికారిత
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 ఏండ్లు పోరాడారు, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషు లతోపాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
మహిళా రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను దేశానికి కాంగ్రెస్ అందిం చింది. అలాగే, మహిళలను లోక్సభ స్పీకర్గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, సీఎంలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది’ అని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, స్వాతంత్ర్యానం తరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షు లుగా సేవలందించారని గుర్తు చేశారు.
రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహి ళల ప్రాతినిథ్యం 50 శాతానికి చేరుకుందని తెలి పారు. మరి 1980 ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు బీజేపీకి 15 మంది అధ్యక్షులైతే.. అందులో ఒక్క రూ కూడా మహిళ లేరని సీఎం తెలిపారు. జన రల్ సెక్రటరీ (సంస్థాగత)లు కూడా లేరని చెప్పా రు.
అద్వానీ, మురళీ మనోహర్ జోషిలాంటి వాళ్లు రెండు, మూడు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. అలాంటి బీజేపీ.. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.