
హైదరాబాద్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అధికారులు మొత్తం 653 ఆక్రమణలను తొలగించారు. ఇందులో 448 తాత్కాలిక షెడ్లు, దుకాణాలతో పాటు, ఫుట్ పాత్లపై నిర్మించిన 165 శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో సాగిన ఈ డ్రైవ్ నగరంలోని ప్రధాన కూడళ్లలో కొనసాగింది.
మెరుగైన ట్రాఫిక్ నిర్వహణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఇకపై కేవలం ఒక్క రోజుతో ఆగిపోకుండా ప్రతీ శనివారం నగరవ్యాప్తంగా ఈ ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ 18న ఉదయం రాజేంద్రనగర్ నుంచి శివరాంపల్లి, ఆరాంఘర్ వరకు రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించారు అధికారులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలుచేపట్టారు అధికారులు.
ఫుట్ పాత్ లను ఆక్రమించడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు అధికారులు. ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఇకపై జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘించి ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని… నిర్మాణాలు కూల్చేస్తామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ అధికారులు