
కోనరావుపేట, వెలుగు: సౌదీలో ఉన్న భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా వాగ్వాదం జరగడంతో భర్త చూస్తుండగానే భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన మానుక కరుణాకర్కు మామిడిపల్లికి చెందిన భానుశ్రీ(27)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం కరుణాకర్ సౌదీకి వెళ్లాడు.
ఈ క్రమంలో భానుశ్రీని కూడా అక్కడికి తీసుకెళ్లగా, మూడు నెలల క్రితం ఆమె తిరిగి స్వగ్రామానికి వచ్చింది. గురువారం ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుతుండగా మాటామాట పెరిగింది. దీంతో భానుశ్రీ భర్త చూస్తుండగానే ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.