
మనతెలంగాణ/హైదరాబాద్: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని సిఎం రే వంత్రెడ్డి తెలియజేశారు. కంపెనీలు వాటితో పాటు తమ కు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించా రు.
ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగా ణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీ ర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేస్తామని సిఎం పేర్కొన్నారు. విద్యపై పెట్టే వ్య యాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్లోనే 44 శాతం ఉన్నారని వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు.
సిఎస్ఆర్ నిధుల వినియోగం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం
సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియమించామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్యా, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సిఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సిఎం తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని సిఎం వారికి అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సిఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు.
ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్యా, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణా రెడ్డి, కామినేని భాస్కర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి, నాడ్యామ్ ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.