
ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది.. దీనికి పెట్రోల్ అవసరం లేదు.. ఎలక్ట్రిక్ వాహనం..మన ఇండియన్ యువ ఇంజనీరు కనిపెట్టాడు.. కారు ఫ్లయింగ్ టెస్టులు అన్నీ పూర్తయ్యాయి.. ఉత్తరాఖండ్ కు చెందిన యువ ఇన్నేవేటర్ రవి తమ్టా దీనిని తయారు చేశాడు. ఇది పర్సనల్ మొబిలిటీలో ఓ పెద్ద అచీవ్ మెంట్.
ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాకు చెందిన యువ ఇన్నోవేటర్ రవి తమ్టా సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్టా..తన స్టార్టప్ హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హపిడా స్కైనెక్స్ అనే ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ ను తయారు చేశారు.
ఏళ్ల తరబడి పరిశోధన, ప్రయోగాల తర్వాత ఈ వాహనం మోడల్ ను విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా విద్యుత్తో నడిచేలా దీనిని రూపొందించారు. దీంతో ఇంధనంతో నడిచే సంప్రదాయ విమానాలతో పోలిస్తే కాలుష్యం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
భారత్లో భవిష్యత్లో పర్యావరణ హితమైన పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ అందించడమే తమ లక్ష్యమని రవి తమ్టా తెలిపారు. అయితే ఈ వాహనం ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. వాణిజ్య వినియోగానికి ముందు మరిన్ని పరీక్షలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు అవసరం.
ఈ టెక్నాలజీ భవిష్యత్లో కేవలం పట్టణ రవాణాకే కాకుండా మారుమూల పర్వత ప్రాంతాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడిన సమయంలో అత్యవసర సేవలకు, వైద్య సహాయానికి ఉపయోగపడొచ్చు. పర్యాటక రంగానికీ ఇది కొత్త అవకాశాలను తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రవి తమ్టా ఆవిష్కరణ భారత యువతలోని ఆవిష్కరణ శక్తికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు.