Reading Time: < 1 minute
Telangana Cheyutha Pensions New Applications Eligibility 2026

Cheyutha Pension: తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఆఖరి తేదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఒంటరి మహిళలు, వితంగార్థులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు), డయాలసిస్‌ బాధితులు, అలాగే దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్‌ సెల్, హిమోఫీలియా బాధితులకు ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేయనున్నారు. పింఛన్లకు అర్హత సాధించాలంటే వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

అదేవిధంగా 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు, నాలుగు చక్రాల లేదా భారీ వాహనాలు ఉన్నవారు, ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వ్యాపారులు, ఆస్తిపరులు ఈ పథకానికి అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారికి కూడా ఇది వర్తించదు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే, తమ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారుల వద్ద సరిచూసుకోవాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ‘చేయూత’ వెబ్‌సైట్‌ నుంచి ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తి చేసిన పత్రాన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణాల్లో వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు లేదా మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాల్సి ఉంటుంది.