బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఒక్కసారిగా ఊపందుకుంటూ వస్తోన్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయనే అంచనాలు ఆర్ధిక నిపుణుల నోట వినిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరగటంతో దేశంలో కూడా దాని ప్రభావం కనిపించింది. ఈ వారంలో బంగారం ధరలు ఏకంగా 6 శాతం మేర పెరిగాయి.
ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు ఆల్టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత ఇప్పుడు ఈ వారంలో అత్యధిక పెరుగుదలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి క్రమంలో బంగారంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో ధరలు పెరగడానికి ఆ పరిణామం దోహదపడుతుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఇంకా స్పష్టత రాకపోవడం, ఆర్ధిక వృద్దిపై ఆందోళనలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఇక యూఎస్ డాలర్ విలువలో మార్పులు కూడా పసిడి ధరలు పెరగడానికి కారణంగా ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తు్న్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు బంగారంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. సెప్టెంబర్లో కొత్త వడ్డీ రేట్లను ఫెడ్ ప్రకటించనుంది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పెట్టుబడి వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉంటే డాలర్ బలహీనపడుతుంది. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశముంది. డాలర్ విలువ పెరిగితే గోల్డ్ రేట్లు తగ్గుతాయి. అదే డాలర్ పడిపోతే రేట్లు పెరుగుతాయి. ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గితే డాలర్ బలపడే అవకాశముంది. ఇదే జరిగితే బంగారం ధరలు కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ డాలర్ పడిపోతే గోల్డ్ రేట్లు 4380 డాలర్లకు చేరుకోవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,350 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే శనివారం రూ.1090 మేర పెరిగాయి. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది.




