
ఏడు పదుల వయసులో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతుళ్లే అతనిపట్ల కసాయివాళ్లలా మారారు. అనారోగ్యంతో ఉన్న కన్నతండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని నమ్మించి, బయటకు తీసుకువచ్చి పక్కా ప్లాన్తో భూమిని కొట్టేసిన దారుణ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెం గ్రామానికి చెందిన గజ్జెల్లి సమ్మయ్యకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కొన్నాళ్ల క్రితం కుమారుడు చనిపోయాడు. సమ్మయ్య కుమారుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమ్మయ్యపై కన్నకూతుళ్లు రాక్షసత్వానికి తెగబడ్డారు. కరోనా సమయంలో తండ్రికి వైద్యం చేయిస్తామని చెప్పి బయటకు తీసుకువచ్చారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లి ‘గిఫ్ట్ డీడ్’ పేరుతో సమ్మయ్యకు చెందిన భూమిని తమ పేరున మార్చేసుకున్నారు. ఆస్తి చేతికి రాగానే కూతుళ్ల అసలు రూపం బయటపడింది. ఆస్పత్రి లేదు, సపర్యలు లేవు.. నడిరోడ్డుపైనే ఆ వృద్ధుడిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటినుంచి కనీస ఆలనాపాలనా లేక సమ్మయ్య నరకం అనుభవించాడు. కానీ, కూతుళ్ల కర్కశత్వానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, తనను ప్రస్తుతం సాకుతున్న కోడలు, మనవడికి న్యాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎలాగో ఓపిక తెచ్చుకుని ఐనవోలు ఎమ్మార్వో కిరణ్కుమార్ను ఆశ్రయించి తన బాధను వెళ్లబోసుకున్నాడు. కూతుళ్లు చేసిన మోసాన్ని ఎమ్మార్వోకి వివరించాడు. కూతుళ్లు కాజేసిన భూమిని తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని.. వారి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరాడు. అంతేకాదు.. ప్రస్తుతం ఆలనాపాలనా చూస్తున్న కోడలు, మనవడికి న్యాయం చేయాలంటూ సమ్మయ్య అధికారులను వేడుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ!