Reading Time: 2 minutes
Chintada Ravi Kumar Detained By Police In Srikakulam

Chintada Ravi Kumar Arrest: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చింతాడ రవికుమార్ తెలిపారు.

కార్యకర్తల అరెస్టులపై చింతాడ రవికుమార్ ఆరోపణలు
తన అనుచరులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు, కుటుంబ సభ్యులను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని చింతాడ రవికుమార్ ఆరోపించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని, అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీస సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ప్రతిరోజూ సుమారు పది మంది పోలీసులు వైఎస్ఆర్‌సీపీ నేతల ఇళ్లకు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామని వెల్లడి
ఈ వ్యవహారంపై గత పది రోజులుగా హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నామని చింతాడ రవికుమార్ తెలిపారు. కేసులో విద్యార్థులు, పార్టీ శ్రేణులు కూడా ఉన్నందున వారి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు. కోర్టులో వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఆముదాలవలసలో పోలీసులు మహిళలు, యువకులు, పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 50 నుంచి 60 మంది పార్టీ క్యాడర్ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని చింతాడ రవికుమార్ ఆరోపించారు. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని, పోలీసుల తీరుతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా తానే పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

డీఎస్పీ కార్యాలయానికి తాను లొంగిపోతున్న విషయం ముందుగానే సమాచారం ఇచ్చామని, తమ పార్టీ నాయకులు, అబ్జర్వర్ కూడా డీఎస్పీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నారని చింతాడ రవికుమార్ చెప్పారు. అయితే మార్గమధ్యంలో చిలకపాలెం వద్ద తన కారును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదని, ఎవరు తీసుకెళ్తున్నారో తెలియకుండా బలవంతంగా కారులో ఎక్కించారని ఆరోపించారు.

ఎస్ఐ ప్రవళికను బలిపశువును చేస్తున్నారని ఆరోపణ
ఈ కేసు విషయంలో ఎస్ఐ ప్రవళికను బలిపశువును చేసి తమపై కక్ష సాధిస్తున్నారని చింతాడ రవికుమార్ ఆరోపించారు. అక్కడ ఏమీ జరగని విషయాన్ని ఏదో జరిగినట్లు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో కోన రవి పాత్ర ఏమీ లేదని, మంత్రి నారా లోకేష్ దగ్గరుండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, తాము ఇన్ని రోజులుగా చట్టపరమైన ప్రక్రియలోనే వెళ్తున్నామని చింతాడ రవికుమార్ పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గించడం సాధ్యం కాకపోవడంతోనే లేనిపోని ఘటనలను సృష్టిస్తున్నారని చింతాడ రవికుమార్ ఆరోపించారు. అయితే పోలీసులు ఆయనను ఏ కేసులో, ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారన్న దానిపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.