
పోలీసులు.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినా కూడా చాలా మంది మోసాలకు గురవుతున్నారు. తాజాగా డేటింగ్ యాప్లో ఓ కిలాడీ ఉచ్చులో పడ్డ ఎందరో విలవిల కొట్టుకున్నారు. చేసేదేమీలేక కాసులు వదిలించుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె కోట్లకు పడగలెత్తింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ మహిళపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డేటింగ్ యాప్ టిండర్, సోషల్ మీడియా ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని.. ఆ తర్వాత వారితో సన్నిహితంగా మెలిగి, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బాధితుల నుంచి రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఓ హైకోర్టు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదు, ఆరోపణలు చేసిన బాధితుల వివరాల ప్రకారం.. పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ టిండర్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా పురుషులను పరిచయం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత స్నేహం పేరుతో వారితో మాట్లాడి.. ఆ తర్వాత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారిని కలిసిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి.. వాటిని అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో ఇరికిస్తామని బెదిరించినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ విధంగా పలువురు బాధితుల నుంచి మొత్తంగా రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో భాగంగా.. సదరు మహిళ చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఐదుగురు వ్యక్తులు జైలుకు వెళ్లినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసులతో పాటు మరిన్ని కేసులు పెడతామని బెదిరించడం, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తామని హెచ్చరించడం ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కేసులోని ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధారించలేదని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఒక ఫొటోలో మంచంపై పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు ఉన్నట్లు కనిపిస్తోంది. మరో ఫొటోలో ఓ మహిళ చేతిలో ఆయుధాన్ని పోలిన వస్తువు పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారు? వాటికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు మాత్రం స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. మరో ఫిర్యాదు ప్రకారం.. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేందుకు సదరు మహిళ వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ‘స్వీటీ తివారీ’ అనే పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఈ వ్యవహారంలో పల్లవి సింగ్ రాజ్పుత్కు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నెట్వర్క్పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.