
నేటి సమాజంలో అధిక బరువు, ఊబకాయం అనేవి సర్వసాధారణ సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బరువు తగ్గడంపై దృష్టిపెడుతున్నారు. అయితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, బరువు తగ్గడంపై ప్రజలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ, సరైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఊబకాయం సమస్యను పరిష్కరించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి.. ఆహార నియంత్రణ, జీవనశైలి మార్పులు, ఒక ప్రత్యేకమైన డీటాక్స్ డ్రింక్ అవసరమని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. వెయిట్ లాస్ కోసం ఎలాంటివి అలవర్చుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
మానసిక నియంత్రణ, ఆహారపు అలవాట్లు:
వైద్య నిపుణుల ప్రకారం.. బరువు తగ్గడంలో ప్రధానమైనది మానసిక నియంత్రణ. ఆహారం పట్ల కోరికలను అదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం శారీరక సమస్య కాదని, మానసిక అంశాలపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆహార చిత్రాలు చూసినా, రీల్స్లో వంటకాలు చూసినా వెంటనే ఆర్డర్ చేసే ధోరణిని నియంత్రించుకోవాలి.
సగం కడుపు తినే పద్ధతి:
తిండి విషయంలో “సగం కడుపు తినాలి” అనే సూత్రాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అంటే కడుపు నిండా తినకుండా, సగం మాత్రమే తినాలి. ఉదాహరణకు, ఉదయం నాలుగు ఇడ్లీలు తినేవారు రెండుకు తగ్గించడం, మధ్యాహ్నం అన్నం మోతాదు తగ్గించడం వంటివి చేయాలి. రాత్రిపూట జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిని రెండు చిన్న పరిమాణంలో తీసుకోవాలి. ఇది శరీరాన్ని అధిక భారం నుండి కాపాడుతుంది.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఉప్పు, చక్కెర తగ్గించడం:
ఆరోగ్యానికి అత్యంత హానికరం అని చెప్పబడే ఉప్పు, చక్కెర వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర విషయంలో 10 చెంచాలకు బదులు ఒక చెంచా మాత్రమే వాడాలని, ఉప్పును కూడా చాలా తక్కువగా వేసుకోవాలంటున్నారు.. ఇది గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది.
డీటాక్స్ డ్రింక్ తయారీ, ప్రయోజనాలు:
శరీరాన్ని శుభ్రపరచడానికి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన డీటాక్స్ డ్రింక్ రెసిపీ గురించి తెలుసుకుందాం..
- జీలకర్ర: 100 గ్రాములు
- సోంపు: 100 గ్రాములు
- వాము: 50 గ్రాములు
- ధనియాల గింజలు: 50 గ్రాములు
ఈ పదార్థాలను కలిపి పొడి చేసి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక టీస్పూన్ ఈ పొడిని నీటిలో వేసి మరిగించి తాగాలి. కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది కాలేయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాలేయం సరిగా పనిచేస్తే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
నీరు తాగే సరైన పద్ధతి:
భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగకూడదని, అరగంట నుండి గంట తర్వాత మాత్రమే గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. గోరువెచ్చని నీళ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. చాలా మంది ఆరోగ్య రహస్యాలలో ఇది ఒకటని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. వీటితోపాటు.. వ్యాయామం, అలాగే.. పొట్టను తగ్గించే ఎక్సర్సైజులు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..