Reading Time: 2 minutes
Sugar Price Hike India Festival Season Retail Price Government Stock Limit

చక్కెర ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పంచదార ధరలు కొండెక్కడంతో సామాన్యులు లబిదిబో అంటున్నారు.

త్వరలోనే కీలక పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో చక్కెర ధరలు 9 శాతం పెరిగాయి. గత నెలలో దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర సుమారుగా 6.6 శాతం పెరిగాయి. నెల రోజుల క్రితం దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు రూ.47.17 ఉండగా.. ఇప్పుడు అది కిలోకు రూ.50.30కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కూడా చక్కెర ధరలు సుమారుగా 9 శాతం పెరిగాయి. పండుగ సీజన్‌కు ముందు చక్కెర ధరలు పెరగడం సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. అయితే పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. నిల్వలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం డీలర్ల దగ్గర పరిమితి కూడా విధించింది. చక్కెర డీలర్లకు నిల్వల పరిమితి ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు పరిమితి అమలులో ఉంటుందని తెలిపింది. దేశీయ వినియోగానికి దేశంలో తగినంత చక్కెర ఉందని, వినియోగదారులకు సరసమైన ధరలకు చక్కెర లభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది.

ధరలు ఎందుకు పెరిగాయి?

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందించింది. ప్రభుత్వం ప్రకారం.. ఇటీవలి ఎక్స్-మిల్ చక్కెర ధరల పెరుగుదల ప్రస్తుత డిమాండ్, సరఫరా పరిస్థితికి అనుగుణంగా లేదు. కొంతమంది వ్యాపారులు, డీలర్లు, మార్కెట్ మధ్యవర్తులు చక్కెరను నిల్వ చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి తెలిసింది. అంతేకాకుండా చక్కెర సరఫరా లేకుండా జరిగే ఊహాజనిత లావాదేవీలు, కాగితపు వ్యాపారాలు మార్కెట్లో కొరతకు పూనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల చక్కెర ధరలలో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని, మిల్లు నుంచి అమ్మే ధరలతో పాటు చిల్లర ధరలు కూడా పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది.

దేశీయ అవసరాలను తీర్చడానికి దేశంలో తగినంత చక్కెర అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్‌లో కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, దేశంలో తగినంత చక్కెర లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం.. చక్కెర వ్యాపారులందరూ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించి ప్రతి వారం తమ చక్కెర నిల్వలను నివేదించడంతో పాటు, వాటిని నవీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చక్కెర మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చక్కెర మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. నిల్వలను, ఊహాగానాలను నివారించడం, మార్కెట్‌లో చక్కెర సరఫరా స్థిరంగా ఉండేలా చూడటం, ధరలు పెరగకుండా నిరోధించడం కోసమే నిల్వలపై పరిమితులు విధించడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.