
UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ, కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ వినియోగదారులకు ఇకపై ఉచితంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీ రుసుము వసూలు చేయబోమని చెప్పింది. అయితే, భవిష్యత్తులో పరిమిత సంఖ్యలో వ్యాపార లావాదేవీలపై స్వల్ప మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశం ఉందని వెల్లడించింది.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్(పీఎస్ఎస్ యాక్ట్)లో ప్రతిపాదించిన సవరణపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. సాధారణ వినియోగదారులపై ఛార్జీలు విధించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం.. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే (P2P) యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో జరిగే వ్యాపార లావాదేవీలపైనా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఎండీఆర్ ప్రవేశపెడితే, అది నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. ఈ ఛార్జీలు కూడా నామమాత్రంగానే ఉంటాయని, డెబిల్ లేదా క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం వర్తించే ఎండీఆర్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని యూపీఐ లావాదేవీలపై ఒకే విధంగా ఛార్జీలు విధించే విధానం ఉండదని స్పష్టం చేసింది.