Reading Time: < 1 minute
Andhra Pradesh: డీజిల్ లేక అంబులెన్స్ బంద్.. ఆస్పత్రిలోనే చిన్నారి మృతి.. పాపం కదా..

పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయం లేక, మెరుగైన వైద్యశాలకు వెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలిక మృతి చెందింది. చింతూరు మండలం పెదసీతనపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి సొడి లశ్య.. సెలెబ్రల్ మలేరియాతో చనిపోయింది. మెరుగైన వైద్యం లభిస్తుందని భావించి చింతూరు ఏరియా ఆసుపత్రికి వచ్చిన గిరిజన బాలికకు నిరాశే ఎదురైంది. 100 పడకల అసూపత్రిగా అప్ గ్రేడ్ అయినా సరైన వసతులు, వైద్య సదుపాయం అందుబాటులో లేక ఇప్పటికీ మెరుగైన వైద్యం లభించడం లేదు. ఇంకా మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, కాకినాడ వెళ్లాల్సిన పరిస్తితి నెలకొంది. ఈ క్రమంలోనే జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన బాలికకు బ్రెయిన్ మలేరియా అని తేల్చారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం లేదా కాకినాడ వెళ్లాల్సి ఉంది. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మెగురైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించలేకపోయారు. దీంతో పాప ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రభుత్వ అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడంతో చింతూరు ఐటిడిఎ ఎదుట ఆందోళన చేపట్టారు బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులు. మృతి చెందిన బాలిక విషయంపై సమగ్ర విచారణ జరపాలని, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అంబులెన్స్ లు 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆందోళన చేపట్టారు. చింతూరు ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబులెన్స్ కి డీజిల్ ఇవ్వట్లేదని, డీజిల్ పేషంట్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో మెరుగైన వైద్యశాలకు వెళ్లలేని పరిస్తితి ఏర్పడింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలతో పాటు చనిపోయిన బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని చింతూరు ఐటిడిఎ పీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై చింతూరు ఐటిడిఎ పీఓ విచారణ చేపట్టారు.