Reading Time: < 1 minute
ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌.. సూసైడ్ నోట్‌ విషయంలో వెలుగులోకి సంచలన విషయాలు!

తెలంగాణవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తనపై తోటి ట్రైనీ ఆఫీసర్ లైంగిక ఆరోపణలు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉదయ్.. కొన్ని రోజుల క్రితం సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడని బాగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసు ఈ సూసైడ్ నోట్ చుట్టే తిరుగుతోంది. ఈ నోట్‌ను ఉదయ్ కృష్ణారెడ్డి మాయం చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

అంతేకాదు, సూసైడ్ నోట్‌లో అన్ని ఆధారాలను ఐఫోన్‌లో పొందుపరిచానని రాసిన ఉదయ్ కృష్ణారెడ్డి.. ఆ ఐఫోన్‌ను కూడా మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్‌లో రాసిన వివరాల గురించి ప్రశ్నించగా.. తాను తాగిన మైకంలో ఈ నోట్ రాశానని, ఆ నోట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు తెలియదని ఉదయ్ చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఆ నోట్ బయటకు ఎలా వచ్చిందనే దానిపై కూడా ఉదయ్ ఎలాంటి సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు.

దీంతో మరోసారి ఉదయ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ విచారణకు సహకరించలేదని, అతని నుంచి మరికొన్ని కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ కేసు వ్యవహారం మొత్తం ఉదయ్ రాసిన ఆ సూసైడ్ నోట్ చుట్టే తిరుగుతోంది. మరో కస్టడీలోనైనా ఉదయ్ నోరు విప్పుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.