
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ యువతకు వ్యవస్థ పదేపదే అన్యాయం చేస్తోందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యువతే దేశానికి అసలైన శక్తి, గర్వకారణమని అన్నారు. ‘‘దేశ యువత కంటే ఎవరూ గొప్పవారు కాదు.. మీరే భారతదేశ శక్తి, గర్వం. నేను ఇలా చెబుతున్నప్పుడు ప్రతి భారతీయ పౌరుడి గురించి మాట్లాడుతున్నాను’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
భారత యువతలో అపారమైన ప్రతిభ ఉందని అన్నారు. చైనా, రష్యా దేశాల యువతతో పోలిస్తే భారత యువత ఎంతో ప్రతిభావంతులని పేర్కొన్నారు. అయితే తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు భారత యువతకు సమాన అవకాశాలు లభించడం లేదని ఆరోపించారు. ‘‘ఈ సాయంత్రం నేను మూడు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవి బాధ, డేటా, సంపద’’ అని అన్నారు. దేశంలోని సుమారు 40 కోట్ల మంది యువతే భారతదేశానికి అతిపెద్ద బలమని పేర్కొన్నారు. అమెరికా, చైనా, రష్యా గురించి తరచూ చర్చ జరుగుతుంటుందని.. కానీ భారత యువతకు సాటిలేరని అన్నారు.
దేశంలోని విద్యా వ్యవస్థపై కూడా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్లో డిగ్రీ సర్టిఫికెట్కు పెద్దగా విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. డిగ్రీ పొందిన తర్వాత కూడా ఉద్యోగం లభించకపోవడంతో విద్యార్హతలు నిరర్థకంగా మారుతున్నాయని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అనంతరం కేపీ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తన పూర్వీకుల నివాసమైన ఆనంద్ భవన్-స్వరాజ్ భవన్కు వెళ్లారు. ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. అలహాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఉజ్వల్ రమణ్ సింగ్తో పాటు పలువురు పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ బాధ్యులు, కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ కార్యక్రమానికి ముందు ప్రయాగ్రాజ్లో ఆయనకు మద్దతుగా పలు పోస్టర్లు, హోర్డింగ్లు కనిపించాయి. ‘‘మాకు ఉద్యోగాలు కావాలి.. పెల్లెట్ గన్స్ కాదు’’, ‘‘మంత్రి గారి పెద్ద కారు.. దేశ యువత నిరుద్యోగం’’ వంటి నినాదాలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. మరో హోర్డింగ్లో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు ‘‘ఉద్యోగం రాకపోతే సింహాసనం కదులుతుంది’’ అనే నినాదాన్ని ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని, కొన్ని షరతులతో కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు.