
హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలోనే తీపి కబురు అందే అవకాశం ఉంది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నెలవారీ , మూడు నెలల పాస్లను ప్రవేశపెట్టే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు ఈ మేరకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్న వివిధ రకాల పాస్ల విధానాన్ని అధ్యయనం చేసి, మెట్రోకు అనువైన ప్రత్యేక పాస్లను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం రోజువారీ ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్లతో పాటు విద్యార్థులు, ఉద్యోగుల కోసం సుమారు ఏడు రకాల పాస్లు అందుబాటులో ఉన్నాయి. అదే మోడల్ను పరిశీలించి మెట్రోలోనూ అమలు చేస్తే దాదాపు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సగటున 4.70 లక్షల నుండి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నిత్యం విడివిడిగా టికెట్లు లేదా స్మార్ట్ కార్డులు వాడటం వల్ల ప్రయాణికులకు ఖర్చు పెరిగిపోతోంది. పాస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే ప్రయాణ వ్యయం తగ్గడమే కాకుండా, నగరంలో వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి ట్రాఫిక్ రద్దీ కూడా అదుపులోకి వస్తుంది. గతంలో మెట్రో అందించిన రాయితీలను నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వ పాత్ర పెరగడంతో ఈ నూతన ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్లను తెచ్చేందుకు కూడా యోచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: