Reading Time: 2 minutes
Upi Charges Small Businesses Kirana Stores Mdr Update

UPI Charges: ఇన్నాళ్లు ఫ్రీగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలు వసూలు చేస్తారనే చర్చ తీవ్రంగా సాగుతోంది. UPIపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. MDR అమలులోకి వస్తే చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు, 2026, యూపీఐ వినియోగదారులు, వ్యాపారులు త్వరలో ఛార్జీలను ఎదుర్కోవచ్చనే ఊహాగానాలకు దారితీసిన నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా ఛార్జీలు విధించినా వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) ప్రకారం, UPI వినియోగించినందు యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేసే ప్రతిపాదన లేదని, అలాగే కిరాణా షాపులు, ఐస్ క్రీమ్ విక్రేతలు, చిన్న షాపుల వంటి వ్యాపారులు యూపీఐ ఉపయోగించినందుకు ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. 2016లో ప్రారంభమైన యూపీఐ సేవలు ఉచితం కావడంతో వేగవంతంగా డిజిటల్ లావాదేవీలు విస్తరించాయి.

MDR అంటే ఏమిటి.?

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పెమెంట్ సర్వీస్ సంస్థలు వసూలు చేసే ఒక ఫీజు. సాధారణంగా ఇది వినియోగదారులు చెల్లించే ఛార్జీలు కావు. అయితే, వ్యాపారులపై ఎండీఆర్ భారం పెరిగితే డిజిటల్ చెల్లింపులు స్వీకరించడానికి వెనుకాడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు, ఈ ఎండీఆర్ ఛార్జీల ద్వారా పేమెంట్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల్ని డెవలప్ చేసేందుకు నిధులు సమకూరుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మర్చంట్ సర్వీస్ ఛార్జీలు అనేవి వ్యాపారులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినవని PCI తెలిపింది.