
Sanjeev OTT Release: తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కథకు ప్రాధాన్యతనిస్తూ పరిమిత బడ్జెట్లో రూపొందిన ఈ డ్రామా చిత్రం ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ‘సంజీవ్’ త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘సంజీవ్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించనున్నారు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్స్లో గుర్తింపు పొందిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత విస్తృతమైన తెలుగు ప్రేక్షకులకు చేరువ కానుంది.
పరిమిత బడ్జెట్తో.. బలమైన కథతో
వీబీ సినిమా బ్యానర్పై అనిల్ నక్క రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. పెద్ద నిర్మాణ సంస్థల అండ లేకపోయినా.. బలమైన కథ, సహజమైన కథనం, నటీనటుల ప్రతిభపై నమ్మకంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సుమారు 70 నిమిషాల నిడివితో తెరకెక్కిన ‘సంజీవ్’ను కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. పరిమిత వనరులు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కథపై నమ్మకంతో టీమ్ మొత్తం కలిసి పనిచేసి సినిమాను పూర్తి చేసింది. థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ నేపథ్యం ఉన్న పలువురు యువకులు ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్కటయ్యారు. తమ సొంత సినిమాను రూపొందించాలనే లక్ష్యంతో ఏర్పడిన టీమ్ APPAHకు ‘సంజీవ్’ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్గా నిలిచింది.
నాలుగు రోజుల్లోనే సినిమా పూర్తి
‘సంజీవ్’ నిర్మాణ ప్రయాణంలో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ, ఒకే లక్ష్యంతో టీమ్ పనిచేయడంతో ఇది సాధ్యమైందని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో వీర మనోహర్, హరీష్ పాలకుర్తి, అచ్యుత్, లయ మిరియాల, అనిల్ నక్క తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ నుంచి సినిమా వైపు వచ్చిన యువ ప్రతిభకు ఈ చిత్రం ఒక ముఖ్యమైన అనుభవంగా మారింది.
ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఏడు అవార్డులు
సినిమా పూర్తయిన తర్వాత ‘సంజీవ్’ పలు జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమైంది. అక్కడ చిత్రానికి మంచి స్పందన లభించడంతో పాటు ఇప్పటివరకు ఏడు అవార్డులు దక్కాయి. ఫెస్టివల్ సర్క్యూట్లో గుర్తింపు పొందిన అనంతరం ఇప్పుడు ఆహా ద్వారా సాధారణ ప్రేక్షకుల ముందుకు రావడం చిత్రబృందానికి మరో కీలక మైలురాయిగా మారనుంది. ‘సంజీవ్’ చిత్రానికి భూపతి కేవై సినిమాటోగ్రఫీ అందించారు. సాయి కృష్ణ నరేడ్ల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జాన్ కే జోసెఫ్ సంగీతాన్ని సమకూర్చారు. పాటలకు శివ శంకర్ చింతకింది, వీర మనోహర్ సాహిత్యం అందించారు.
దర్శకుడు అనిల్ నక్క ఏమన్నారంటే..
‘సంజీవ్’ తనకు కేవలం సినిమా కాదని, తన సినిమా ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయమని దర్శకుడు అనిల్ నక్క తెలిపారు. తన స్వస్థలం చేర్యాల, సిద్దిపేట జిల్లా నుంచి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు చెప్పారు. పెద్ద బడ్జెట్, భారీ వనరులు లేకపోయినా మంచి కథను నిజాయితీగా ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ‘సంజీవ్’ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కథపై, టీమ్పై ఉన్న నమ్మకంతోనే సినిమాను రూపొందించామని, ప్రతి ఒక్కరి కష్టం, సమయం, నమ్మకం సినిమాకు బలంగా నిలిచాయని అనిల్ నక్క చెప్పారు. కేవలం నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం తమకు పెద్ద సవాలేనని, అయితే టీమ్ అంతా ఒకే లక్ష్యంతో పనిచేయడంతో సాధ్యమైందన్నారు. ‘సంజీవ్’కు ఏడు అవార్డులు రావడం తమ టీమ్కు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆహా ద్వారా మరింత మంది తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఓటీటీ విడుదల ప్రకటనను శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఆవిష్కరించడం తమ ప్రయాణంలో మరిచిపోలేని ఘట్టమని పేర్కొన్నారు.