
Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా ప్రేమ, పెళ్లిపై తన నమ్మకం ఇప్పటికీ అలాగే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. హిందీ మ్యూజిక్ ప్రపంచంలో సమి బెస్ట్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ పాటలతో భారత్లోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులను సంపాదించుకున్న ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్ళిళ్ళ బంధానికి ముగింపు పలకడం. అయినప్పటికీ వాటి కారణంగా ప్రేమపై నమ్మకం కోల్పోలేదని చెప్పడం వంటి విషయాలతో అందరినీ ఆశ్చర్యపరచారు. మరోవైపు పాకిస్తాన్పై ఆయన తీసుకుంటున్న వైఖరి కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అసలు సమి వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలేంటి? పాకిస్తాన్లో ఆయనను దేశద్రోహి అని ఎందుకు విమర్శించారు? అనే విషయాలకు ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు.
రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మూడు పెళ్ళిళ్ళ గురించి అద్నాన్ సమి బహిరంగంగా మాట్లాడారు. మూడు వివాహాలు విఫలమవడం తనను ఎంతో బాధించిందని చెప్పిన ఆయన, తాను నిజానికి రొమాంటిక్ వ్యక్తినని, ప్రేమను ఇష్టపడతానని వెల్లడించారు. అయినా కూడా వివాహంలో పరిస్థితులు అనుకూలించని సందర్భాలు ఉంటాయని, అయితే వాటి కారణంగా పెళ్లిపై తన నమ్మకాన్ని కోల్పోలేదని స్పష్టం చేశారు. అందుకు తన తల్లిదండ్రుల వివాహమే తనకు పెద్ద ఉదాహరణ అని అద్నాన్ తెలిపారు. వారు కూడా తమ వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆ బంధాన్ని నిలబెట్టేందుకు కృషి చేశారని చెప్పారు. వారి వివాహం విజయవంతం కావడానికి వారు చేసిన ప్రయత్నాలను చూస్తూ పెరిగిన తనకు, తాను కూడా ప్రేమను మరోసారి నమ్మకూడదనే కారణం కనిపించలేదని వివరించారు.
విఫలమైన సంబంధాల నుంచి పూర్తిగా బయటపడ్డారా అని అడిగినప్పుడు కూడా అద్నాన్ సమి తన గతాన్ని దాచిపెట్టకుండా స్పందించారు. ఒకసారి గాజు పగిలిన తర్వాత దాన్ని మునుపటిలా చేయడం కష్టమేనని, అయితే తాను ఇప్పుడు ముందుకు సాగిపోయానని చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని, తాను కూడా తప్పులు చేశానని, వాటి నుంచి నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. వివాహ బంధంలో జరిగిన ప్రతిదానికీ ఒకరినే పూర్తిగా నిందించడం సరైంది కాదనే భావనను కూడా ఆయన పంచుకున్నారు.
ఇదిలా ఉంటే అద్నాన్ సామి వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన పాకిస్తాన్పై తీసుకుంటున్న వైఖరి కూడా తరచూ చర్చకు వస్తోంది. యూకేలో జన్మించిన ఆయన 2001లో భారత్కు వచ్చారు. కొంతకాలం సందర్శక వీసాతో భారత్లో ఉన్న అనంతరం, పాకిస్తాన్, కెనడా పౌరసత్వాలను కలిగి ఉన్న ఆయన 2015లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2016లో భారత పౌరసత్వం పొందారు. భారత పౌరసత్వం పొందిన తర్వాత పాకిస్తాన్కు సంబంధించిన అంశాలపై అద్నాన్ సమి బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు. ముఖ్యంగా 2025 పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ, ఐఎస్ఐ ఆయనపై దేశద్రోహి అనే ముద్ర వేసిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే తాను ఎవరితోనైనా రహస్య సమాచారం పంచుకున్నానా, తనను దేశద్రోహి అని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు.
పాకిస్తానీ సైన్యం, ఐఎస్ఐపై కూడా అద్నాన్ సామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు చెందిన కొందరు జనరల్స్ గతంలో తన పాటలకు డ్యాన్స్ చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన సంగీతాన్ని ఆస్వాదించిన వ్యక్తులే ఇప్పుడు తనను దేశద్రోహిగా పిలవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇప్పుడు అద్నాన్ సమి మరోసారి తన సంగీతంతో వార్తల్లోకి వచ్చారు. ఆయన కొత్త రొమాంటిక్ సాంగ్ ‘ఇష్క్ తమాషా’ విడుదలైంది. ఈ పాటకి కూడా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.
అయితే అద్నాన్ సమి కథ ఒక గాయకుడి కెరీర్ కు సంబంధించిన కథే కాదు. ప్రేమలో వైఫల్యాలు, వ్యక్తిగత తప్పిదాల నుంచి నేర్చుకోవడం, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం, తాను నమ్మిన సిద్దాంతాల కోసం విమర్శలను ఎదుర్కోవడం వంటి ఎన్నో కోణాలను కలిపిన ప్రయాణం. ఇప్పుడు ‘ఇష్క్ తమాషా’తో మరోసారి ప్రేమ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అద్నాన్ సామి, తన జీవిత అనుభవాల తర్వాత కూడా ప్రేమను ఎందుకు ఇంతగా నమ్ముతున్నారో చెప్పడం ఆయన వ్యక్తిత్వంలోని మరో ఆసక్తికరమైన కోణంగా మారింది.