Reading Time: 2 minutes
Kims Hospital Priyanka Critical Condition Father Appeal Ap Government

Medico Priyanka : హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కూతురు పరిస్థితిని చూసి ఆ తండ్రి తీవ్ర వేదనకు గురవుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తె ప్రియాంకను బ్రతికించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నామని, అయితే ఆమె శరీరం వైద్యానికి సహకరించడం లేదని బాధితురాలి తండ్రి వెంకటేష్ మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు.

బ్రెయిన్ డెడ్.. శరీరంలో పడిపోయిన సోడియం లెవెల్స్

ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించిన విషయాలను వెంకటేష్ పంచుకుంటూ.. “పాప బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయిందని డాక్టర్లు చెప్పారు. బ్రతికే ఆశలు లేవని స్పష్టం చేశారు. అప్నియా (Apnea) పరీక్ష చేస్తామని చెప్పారు కానీ, బాడీలో సోడియం లెవెల్స్ తీవ్రంగా పడిపోవడంతో ఆ పరీక్షను కూడా ప్రస్తుతం చేయలేకపోతున్నారు. సోడియం స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొస్తేనే అప్నియా పరీక్ష చేయగలమని వైద్యులు తెలిపారు. మేము మాత్రం మా కూతురు ఎలాగైనా కోలుకుని తిరిగి వస్తుందనే ఆశతోనే ఉన్నాం” అని తెలిపారు.

అవయవ దానంపై స్పష్టత.. స్పందించిన ఏపీ ప్రభుత్వం

సోషల్ మీడియా, ఇతర వర్గాల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. “మా పాప అవయవ దానం (Organ Donation) విషయమై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు మా వద్దకు వచ్చి ఈ విషయంలో ఎవరూ సంప్రదించలేదు. మరోవైపు ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నా భార్య ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో ఆమెను రాజమండ్రిలోని ఆస్పత్రిలో చేర్చాం” అని చెప్పారు. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి స్థానిక ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయిలో స్పందించి తమ కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు.

థియేటర్ వద్ద గొడవ.. ఆపై నడిరోడ్డుపై ఘోరం

కారు ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సినిమా థియేటర్‌లో ఇద్దరు నిందితులు మద్యం తాగి గొడవపడ్డారు. థియేటర్ యాజమాన్యంతో గొడవపడి ఆ కోపంతో కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా బయటకు తీశారు. సరిగ్గా అదే సమయంలో నా కూతురు, ఉమేష్ లోపలికి వెళ్తుండగా వారిని కారుతో బలంగా ఢీకొట్టారు. అంతటితో ఆగక నా కూతురు తలపై నుంచి కారు ఎక్కించి అక్కడినుంచి పరారయ్యారు. వారికి కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా?” అని ప్రశ్నించారు.

నిందితులను నడిరోడ్డుపై కొట్టి చంపాలి

ఘటన తెలిసిన వెంటనే రాజమండ్రి నుంచి చేరుకుని, ప్రియాంకకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కిమ్స్ వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించినప్పటికీ, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారని వాపోయారు. “ఎలాగైనా మా అమ్మాయిని బ్రతికించండి” అని డాక్టర్లను ప్రాధేయపడుతున్నామని చెప్పారు. ఈ ఘోరానికి కారణమైన నిందితులను చట్టం అతి కఠినంగా శిక్షించాలని, నడిరోడ్డుపై కొట్టి చంపితేనే ఇటువంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని వెంకటేష్ ఆవేదన చెందారు.