Reading Time: 2 minutes
Mojtaba Khamenei Critical Health Death Rumours Iran Supreme Leader

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ తాజాగా పలు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ నాయకత్వానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ఇరాన్‌వైర్’ ఈ వివరాలను వెల్లడించింది. అయితే మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్‌వైర్ కథనం ప్రచురించింది. దేశ అత్యున్నత నాయకత్వ స్థాయిలో మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొంది. ఒకవేళ త్వరలోనే మొజ్తబా ఖమేనీ ‘మరణ వార్త’ విన్నా అధికారులు ఆశ్చర్యపోరని ఓ వర్గం పేర్కొన్నట్లు తెలిపింది. అయితే ఈ వాదనలకు స్వతంత్రంగా ధ్రువీకరణ లేదు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత ఆయన దాదాపు పూర్తిగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్షంగా టెలివిజన్‌లో కనిపించలేదని, లైవ్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని సమాచారం. ఎక్కువగా లిఖితపూర్వక ప్రకటనల ద్వారానే తన సందేశాలను వెల్లడిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఆరోగ్యం, దేశ పాలనలో ఆయన ప్రత్యక్షంగా ఎంతవరకు భాగస్వామ్యం అవుతున్నారనే అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తండ్రి నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన తొలి దాడుల్లో మొజ్తబా ఖమేనీ కూడా గాయపడినట్లు గతంలో పలు నివేదికలు ఉన్నాయి. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, వాటి కారణంగా బహిరంగంగా కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంటున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా సీనియర్ ప్రభుత్వ అధికారులతో మొజ్తబా నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఇరాన్ నాయకత్వ వ్యవస్థ ప్రస్తుతం ఎలా పనిచేస్తోంది? కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొజ్తబా ఖమేనీతో నేరుగా సంప్రదించడం ప్రస్తుతం ‘‘చాలా కష్టం’’గా ఉందని వ్యాఖ్యానించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ వ్యాఖ్యలు ఆయన ఎక్కడ ఉన్నారు? ఎంతవరకు పాలనలో పాల్గొంటున్నారు? అనే అనుమానాలను మరింత పెంచాయి. మొజ్తబా ఖమేనీ ఆచూకీపై గతంలోనూ అనేక ప్రచారాలు జరిగాయి. జులైలో సౌదీ అరేబియాకు చెందిన ‘అల్-హదత్’ మీడియా సంస్థ.. ఇజ్రాయెల్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ మొజ్తబా ఇరాన్‌లో లేరని కథనం ప్రచురించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో ఇరాన్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేశారు. ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అగ్ర సైనిక నాయకత్వం పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా ఖమేనీ ‘‘90 శాతం వరకు పోయారు’’ అంటూ ఆయన తీవ్రంగా గాయపడి, పనిచేయలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మొజ్తబా ఖమేనీ గాయాల తీవ్రతపై వస్తున్న వార్తలను ఇరాన్ అధికారులు గతంలో కొట్టిపారేశారు. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఆయనకు ప్రారంభంలో స్వల్ప గాయాలే అయ్యాయని పేర్కొన్నట్లు సమాచారం. సీనియర్ అధికారులు కూడా ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, ఆపరేషనల్ ఆదేశాలు ఇచ్చే స్థితిలోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆయన ప్రత్యక్షంగా ప్రజల్లోకి రాకపోవడం, లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితం కావడం, మధ్యవర్తుల ద్వారా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలు అనుమానాలను కొనసాగిస్తున్నాయి. పాశ్చాత్య, ప్రతిపక్ష అనుబంధ నిఘా వర్గాలు కూడా ఆయనకు తొలి దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయని గతంలో పేర్కొన్నాయి.

ఇరాన్‌లో సుప్రీం లీడర్‌కు రాజకీయ, సైనిక, మతపరమైన వ్యవహారాలపై అత్యంత కీలక అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయితే లేదా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వెల్లడైతే.. దేశ నాయకత్వం, అధికార బదిలీ, పాలనా వ్యవస్థపై తీవ్ర అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలను గానీ, ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారాన్ని గానీ ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఆయన సుదీర్ఘంగా ప్రజలకు దూరంగా ఉండటం, గాయాలపై భిన్న కథనాలు రావడం, ఆరోగ్యంపై వరుసగా కొత్త ప్రచారాలు వెలువడుతుండటంతో ఇరాన్ అత్యున్నత నాయకత్వంలో వాస్తవంగా అధికారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? అనే చర్చ మరింత తీవ్రమవుతోంది.