Reading Time: < 1 minute

పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ సీఐ సంపత్తి కనుకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇటీవల ఫేక్ పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన కేరళకు చెందిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు సూచించారు, చార్జిషీట్ ఫైల్ చేయడం కోసం బాధితుడిని సీఐ కనకయ్య,

ఎస్‌ఐ సిద్ధేశ్వర్‌లు మొదటగా రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబసభ్యుల పేర్లు కూడా చార్జిషీట్‌లో చేరుస్తామని వారు హెచ్చరించారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడగా రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం రూ.2 లక్షల లంచం సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్దేశ్వర్‌లు తీసుకుంటుండగా పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.