
ఘటనా స్థలంలోనే ఆన్–సైట్ ఎఫ్ఐఆర్ నమోదు
మన తెలంగాణ/మదనపురం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదం కారణంగా ఓ మహిళ ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా మదనపురం మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై జగదీశ్వర్ తెలిపిన వివరాలు ప్రకారం… కర్వేన గ్రామానికి చెందిన బోయ మొగులమ్మ (48) కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు బోయ రాజు ప్రస్తుతం రామన్ పాడుగ్రామంలోని తన తాతగారి ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమె ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గుడిసె వేసే విషయంలో గత కొంత కాలంగా కొడుకు, కూతురితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా గొడవ జరగడంతో, తీవ్ర మనస్థాపానికి గురైన తన ఇంట్లోని పైకప్పు ఐరన్ రాడ్కు ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానంలో భాగంగా మృతురాలి ఇంటి వద్దనే ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు