
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 10 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు నిర్మల్ నుంచి ఉదయగిరికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల హాహాకారాలు, ఆక్రందనలు, మంటలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.