
న్యూఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కిషన్ గుజ్జర్ తన పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. హర్యానా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న గుజ్జర్.. పార్టీలోని అన్ని బాధ్యతల నుండి తనను విముక్తి చేయాలని కోరుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
రాజీనామా అనంతరం గుజ్జర్ మాట్లాడుతూ.. పార్టీ నాయకురాలు శైలి చౌదరిని అప్రతిష్టపాలు చేయడానికి ‘పెద్ద కుట్ర’ జరుగుతోందని ఆరోపించారు. “శైలి చౌదరి ఒక విధేయ కార్యకర్త. ఆమెను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని గుజ్జర్ అన్నారు. తప్పుడు ప్రచారం, అంతర్గత దాడికి నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
హర్యానాలో మార్చి 16, 2026న జరిగిన నాటకీయ రాజ్యసభ ఎన్నికల నుండి ఈ వివాదం మొదలైంది. ఫిరాయింపుల ప్రయత్నాలను నివారించడానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయినప్పటికీ పోలింగ్ లో క్రాస్-ఓటింగ్ జరిగిందని.. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు అనుమానిస్తున్న వారిలో చౌదరి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.