
Subhadeep Ghosh Likely To Appoints as India Fielding Coach: శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్ బృందంలో కొత్త ఫీల్డింగ్ కోచ్గా మాజీ అసోం, రైల్వేస్ క్రికెటర్ శుభదీప్ ఘోష్ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ అనంతరం టీ. దిలీప్ ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించకపోవడంతో ఆయన స్థానంలో ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్నే ఆయన తొలి అసైన్మెంట్గా భావిస్తున్నారు.
శుభదీప్ ఘోష్ 1994 నుంచి 2004 మధ్యకాలంలో మొత్తం 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఆటగాడిగా కెరీర్ ముగిసిన తర్వాత కోచ్గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అసోం సీనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్గా పనిచేయడంతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), భారత మహిళల జట్టు, ఇండియా-ఏ జట్లకు కూడా సేవలందించాడు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లతో కూడా పనిచేసిన అనుభవం ఉంది. శుభదీప్ నియామకాన్ని అసోం క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవీకరించింది. భారత జట్లతో పనిచేస్తూ కోచ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘోష్కు ఇది గొప్ప గౌరవమని అసోసియేషన్ పేర్కొంది. ఘోష్ నియామకం అసోం క్రికెట్కు గర్వకారణమని.. యువ క్రికెటర్లు, కోచ్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్లో ఇటీవల పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా సితాంశు కోటక్, బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో శుభదీప్ ఘోష్ రాకతో కోచింగ్ బృందానికి మరింత బలం చేకూరుతుందని బీసీసీఐ భావిస్తోంది. టెన్ డస్కటే మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. నైట్ రైడర్స్ స్పోర్ట్స్కు ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’గా నియమితుడయ్యాడు. ఈ బాధ్యతల్లో భాగంగా ప్రతిభావంతులైన ఆటగాళ్ల అన్వేషణ, జట్టు ప్రణాళిక, ఆటగాళ్ల ఎంపిక, పనితీరు విశ్లేషణ వంటి అంశాలను పర్యవేక్షించనున్నాడు. అలాగే ట్రిన్బాగో నైట్రైడర్స్, అబుదాబి నైట్రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్గా కూడా సేవలందించనున్నాడు.