
Rakhi Sawant: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా తనను ముస్లింగా అంగీకరించకుండా ట్రోల్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ సావంత్ ఒక మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు. 2022లో ఆదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకున్న సమయంలో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును ఫాతిమాగా మార్చుకున్నారు. తర్వాత వారి వివాహ బంధం ముగిసినా, తాను ఇప్పటికీ ఇస్లాం మతాన్నే మనస్ఫూర్తిగా అనుసరిస్తున్నానని ఆమె చెబుతున్నారు. తన వ్యక్తిగత జీవితం మారినా, విశ్వాసం మాత్రం మారలేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల బీబీసీ న్యూస్ హిందీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి విస్తృతంగా మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఎనిమిది సార్లు పవిత్ర మక్కా, మదీనా నగరాలకు వెళ్లి ఉమ్రా పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోజుకు ఐదు పూటలా నమాజ్ చేస్తానని, పవిత్ర ఖురాన్ను పఠిస్తానని, తహజ్జుద్ నమాజ్ కూడా ఆచరిస్తానని చెప్పారు. ఈ విశ్వాసమే తనకు మానసిక బలం, రక్షణ ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే బాలీవుడ్లో పనిచేయడం, గ్లామరస్ దుస్తులు ధరించడం వల్ల చాలామంది తనను నిజమైన ముస్లింగా చూడడం లేదని రాఖీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ముస్లింనా కాదా అనేది బయటివారు నిర్ణయించే విషయం కాదని, అది పూర్తిగా దేవుడికి, ఆ వ్యక్తికి మధ్య ఉండే సంబంధమని ఆమె అన్నారు. తన వృత్తి లేదా దుస్తుల ఆధారంగా మత విశ్వాసాన్ని కొలవడం సరికాదని స్పష్టం చేశారు.
ట్రోల్స్ను ఉద్దేశించి రాఖీ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. నేను బాలీవుడ్లో పనిచేస్తున్నానని, పొట్టి దుస్తులు వేసుకుంటున్నానని నన్ను ముస్లిం కాదని ఎలా అంటారు? నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు? అంటూ ఆమె ప్రశ్నించారు. అలాగే తనను విమర్శించే వారిపై వ్యంగ్యంగా స్పందిస్తూ, మీరు కోటీశ్వరులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక్కసారి కూడా ఉమ్రాకు పిలవలేదు. నాకు మాత్రం ఎనిమిది సార్లు ఆ అదృష్టం దక్కిందని అన్నారు. రాఖీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనను తెచ్చుకున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన విశ్వాసాన్ని ధైర్యంగా సమర్థించుకున్నందుకు ప్రశంసిస్తున్నారు. మత విశ్వాసం అనేది పూర్తిగా వ్యక్తిగత అంశమని, దుస్తులు లేదా వృత్తి ఆధారంగా ఒకరి విశ్వాసాన్ని నిర్ణయించకూడదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాఖీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.