Reading Time: < 1 minute
Ktr Slams Telangana Government Over Job Calendar Questions Congress On Poll Promises

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో యువత తీవ్ర నిరాశలో ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని యువత ఒక రకమైన నిర్వేదంలో ఉందన్నారు. దేశ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతోందని.. ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను ప్రస్తావిస్తూ.. రెండేళ్ల క్రితం కూడా ఉద్యోగాల భర్తీపై హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రచార సభల్లో ఇచ్చిన హామీలకు విలువ లేకపోయినా, కనీసం శాసనసభలో ఇచ్చిన మాటకైనా విలువ ఉండాలని అన్నారు.

ఇటీవల ఖమ్మంలో వేణు అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనను ప్రస్తావించిన కేటీఆర్.. అతడు రాసిన సూసైడ్ నోట్‌లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చేరే వరకు షేర్ చేయాలని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ లేఖలో తమను కూడా ప్రస్తావించారని, అయితే అది సాధారణ సూసైడ్ నోట్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాసిన చార్జ్‌షీట్‌లాంటిదని అన్నారు.

అశోక్‌నగర్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను గుర్తు చేస్తూ.. ఉద్యోగాలు ఇవ్వకపోతే రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణకు ఎందుకు రావడం లేదు.? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో అక్కడికి వెళ్లరు.. కానీ తమ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మాత్రం రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతారంటూ విమర్శించారు. చివరగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.