Reading Time: 2 minutes
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?

Vande Bharat Sleeper: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్ చల్ చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే నూతన వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందని, దానికి సంబంధించిన వేళపట్టిక (టైమింగ్స్), రూట్ మ్యాప్ కూడా సిద్ధమైపోయాయని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ వైరల్ క్లెయిమ్‌పై దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే జోన్ – విశాఖపట్నం హెడ్‌క్వార్టర్స్) అధికారులు స్పందించారు.

వైరల్ అవుతున్న వార్తలో ఏముంది?

సోషల్ మీడియా ప్రచారాల ప్రకారం.. ఈ వందే భారత్ స్లీపర్ రైలు విశాఖపట్నంలో ప్రారంభమై విజయవాడ, తిరుపతి, జోలార్‌పేట మీదుగా బెంగళూరు చేరుకుంటుందని వార్తలు వచ్చాయి. రాత్రి సమయంలో నిద్రపోయేలా వేళాపట్టిక కూడా ఖరారైందని, త్వరలోనే ఈ సేవలకు అందుబాటులోకి వస్తుందని వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు.

రైల్వే అధికారుల క్లారిటీ:

ఈ ప్రచారం అంతా అబద్దమని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు స్పష్టం చేశారు. విశాఖపట్నం – బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ లేదా సౌత్ కోస్ట్ రైల్వే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. అయితే సోషల్‌ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న టైమ్‌టేబుల్, రూట్ మ్యాప్‌లు కేవలం పుకార్లు మాత్రమేనని, వాటికి అధికారిక ప్రకటన లేదని స్పష్టం చేశారు. రైలు సర్వీసులకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను ప్రయాణికులు నమ్ముతారు. ఏదైనా కొత్త రైలు ప్రారంభమైతే కేవలం ఇండియన్ రైల్వేస్ లేదా సంబంధిత జోనల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లు ద్వారా వచ్చే సమాచారం నమ్మాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Personal Finance: అత్యవసర సమయంలో లోన్‌ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా?

వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రస్తుత స్థితి:

భారతీయ రైల్వే సుదూర ప్రాంతాల ప్రయాణాల కోసం ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ట్రయల్, తయారీ పనులను వేగవంతం చేస్తుంది. అయితే, వీటిని ఏ మార్గాల్లో ముందుగా ప్రవేశపెడతారు అనేదానిపై రైల్వే బోర్డు ఇంకా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు.

ఇదిలా ఉండగా, విశాఖపట్నం నుండి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు వస్తుందని ఆశగా ప్రయాణికులకు ఇది కొద్దిగా నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న టైం టేబుల్స్ పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులు ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అయితే ఈ రూట్లలో వందేభారత్ స్లీపర్‌ రైలు నడపాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ దానిని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న డాక్యుమెంట్ కేవలం ఒక అంతర్గత ప్రక్రియ మాత్రమేనని సీనియర్‌ రైల్వే అధికారి తెలిపారు. విశాఖపట్నం నుంచి అదనపు రైలు సర్వీసులను నడపడం కోసం సాధ్యమయ్యే రైలు రూట్లను, అనువైన మార్గాలను గుర్తించేందుకు జారీ చేశారన్నారు. ఈ కొత్త ప్రతిపాదనలను రైల్వే బోర్డు మాత్రమే ధృవీకరించి, ఆమోదిస్తుందన్నారు. ఈ వందేభారత్ స్లీపర్ రైలు అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: usiness Ideas: పండుగల సీజన్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ఉత్తమ బిజినెస్ ఐడియాలు!

ఇది కూడా చదవండి: Gold: భారత్‌లో బంగారం ధర రూ.37,000 మేర తగ్గినా, ప్రజలు ఎందుకు కొనడం లేదు.. అసలు కారణం ఇదేనా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి