
SS Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. సాధారణంగా ఎవరైనా సరే ఈ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంటే అందులో ఏదో ఒకటి తన సినిమాల్లో బెస్ట్ మూవీ అని అనుకుంటారు. కానీ జక్కన్న సినిమా స్టైలే వేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నప్పటికీ, తనకు మాత్రం ‘ఈగ’ చిత్రమే అత్యంత ఇష్టమైన సినిమా అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “ఈగ ఈజ్ మై బెస్ట్ ఫిల్మ్.. ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్” అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచవ్యాప్త విజయాలు సాధించిన చిత్రాల కంటే కూడా ‘ఈగ’కే ఆయన ప్రత్యేక స్థానం ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ కామెంట్స్తో పాటు రాజమౌళి తన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా ఓ అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తుందని ఆయన చెప్పారు. సినిమా కథ వారణాసిలో ప్రారంభమై అక్కడి నుంచి మంచుతో కప్పుకున్న అంటార్కిటికా వరకు, అనంతరం ఆఫ్రికా ఖండానికి చేరుకుంటుంది. ఆ తర్వాత కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్యాన్ని తాకి.. చివరికి మళ్లీ వారణాసికే చేరుకునే విధంగా కథను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.