
స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఏదోక యూపీఐ యాప్ వాడుతుంటారు. యూపీఐ లావాదేవీలు రోజురోజుకు రికార్డ్ సృష్టిస్తున్నాయి. ప్రతీరోజూ బిలియన్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. దీంతో పాటు యూపీఐ ద్వారా జరిగే మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు కొత్త ప్రతిపాదన చేశాయి. అనుమానాస్పద లేదా అధిక రిస్క్తో కూడుకున్న యూపీఐ లావాదేవీలు చేసేముందు పలు సేఫ్టీ ఫీచర్లను పాటించాలని బ్యాంకులు సూచించాయి. ఇలాంటి లావాదేవీలు చేసేముందు వినియోగదారులను అలర్ట్ చేసేలా కొత్త విధానాన్ని ప్రతిపాదించాయి. ఈ కొత్త విధానం ఏంటి..? ఎలా పనిచేస్తుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
లావాదేవీ చేసేముందు అలర్ట్ మెస్సేజ్..
యూపీఐ ద్వారా జరిగే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐకు బ్యాంకుల కీలక ప్రతిపాదనలు చేశాయి. అనుమానాస్పద, హైరిస్క్ కలిగిన లావాదేవీలు చేసేముందు స్క్రీన్పై అవును లేదా కాదు అనే పాప్ అప్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని ఎన్పీసీఐ, ఆర్బీఐకు బ్యాంకులు సూచించాయి. అవునుపై ప్రెస్ చేస్తే లావాదేవీలు వెంటనే ప్రాసెస్ అవుతుంది. కాదు అని చెబితే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఎంచుకోకపోతే గంటలోపు డబ్బులు బదిలీ అవుతాయి. చెల్లింపులు చేసేముందు ఒక అలర్ట్ మెస్సేజ్ తరహాలోనే ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారులు మరోసారి కరెక్ట్ వ్యక్తికి పంపుతున్నాడా..లేదా అనేది తనిఖీ చేసుకునేందుకు సహాయపడుతుంది. తొందరపాటులో తప్పుడు వ్యక్తికి డబ్బులు పంపించడాన్ని ఇది కొంతమేర అడ్డుకట్ట వస్తుంది. ఈ విధానం తీసుకొచ్చేలా పలు బ్యాంకులు తమ పేమెంట్స్ యాప్స్లలో మార్పులను సూచిస్తున్నాయి. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు డబ్బు రిసీవర్ ఖాతాలో జమ చేయడానికి ముందు యస్ లేదా నో అనే విధానంలో చెల్లింపుదారుడి ఆమోదం కోరతారు.
రూ.10 వేలకు మించి పంపాలంటే..
యూపీఐ ద్వారా రూ.10 వేలకు మించి పంపుతుంటే గంట వెయిటింగ్ పీరియడ్ వ్యవస్థను ఆర్బీఐ తీసుకురావాలని సూచిస్తోంది. ఈవిధానంలో మనం రూ.10 వేలకు మించి పంపాలంటే గంట తర్వాతనే రిసీవర్ ఖాతాలో పడతాయి. ఆ లోపు మీరు ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా అనేక బ్యాంకులు యస్ లేదా నో అనే ఆప్షన్ను సూచిస్తున్నాయి. అయతే రూ.10 వేల పరిమితికి మించి చేసే లావాదేవీలకు “అవును-ఏమీ లేదు” అనే ప్రాంప్ట్ను చూపించమని బ్యాంకులు సూచించడం లేదు. తెల్లవారుజామున 2 గంటలకు చేసే లావాదేవీలు, వినియోగదారుడు ఇంతకు ముందు ఎన్నడూ లావాదేవీలు జరపని వారికి చేసే చెల్లింపులు, లేదా కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలకు (తరచుగా మనీ మ్యూల్స్ ఉపయోగించేవి) చేసే చెల్లింపులు వంటి అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించే చెల్లింపులకు మాత్రమే ఈ ప్రాంప్ట్ కనిపించాలని కోరుతున్నాయి.