
ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూ దందాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ కూడా నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. మరోవైపు విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో పాండురంగస్వామి ఆలయ భూమిని కొందరు వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపిస్తూ ఆలయ పరిరక్షణ సమితి ఆందోళనకు సిద్ధం కాగా.. ఆ కార్యక్రమానికి బీజేపీ మద్దతు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు వర్గాల నుంచి ధర్నాలకు అనుమతి కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. అయితే గుంతకల్లు పోలీసు సబ్డివిజన్ పరిధిలో ప్రస్తుతం సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని సీఐ మహానంది వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, అలాగే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీ్జీఆర్ఎస్) కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణాల వల్ల ధర్నాలకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు.
అయితే పోలీసుల నిర్ణయంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలిరావాలని పిలుపునిస్తూ ఆయన చేసిన వీడియోను వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ధర్నాలోపాల్గొనేందుకు వెళ్తున్న విశ్వేశ్వర రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా వాహనంలో ఎక్కించారు. దాంతో వైసీపీ శ్రేణులు, పోలిసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.