
Vismaya Mohanlal: ఎవరి జీవితంలో అయినా కొన్ని ప్రయాణాలు, కొన్ని అనుభవాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి ఓ మరపురాని జ్ఞాపకాన్ని ఇప్పుడు పంచుకున్నారు మోహన్లాల్ కుమార్తె విస్మయ మోహన్లాల్. త్వరలో ‘తుడక్కం’ సినిమాతో హీరోయిన్గా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్న ఆమె, తన సోదరుడు ప్రణవ్ మోహన్లాల్తో కలిసి చేసిన హిమాలయ ట్రెక్కింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఏడు గంటల ట్రెక్, దారి తప్పిన క్షణాలు, చివరి వరకు తమ వెంట వచ్చిన ఓ చిన్న కుక్కపిల్ల గురించి చెప్పిన కథ అభిమానులను ఆకట్టుకుంటోంది.
జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తుడక్కం’ ఆగస్టు 7 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ విస్మయ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు జర్నీ అంటే ఇష్టమని, ప్రపంచంలోని చాలా దేశాలు చూసినప్పటికీ, హిమాలయాల్లో గడిపిన రోజులు మాత్రం తన జీవితంలో మెమొరబుల్ డేస్ గా మిగిలిపోయాయని చెప్పారు. తన సోదరుడు ప్రణవ్, కుటుంబ సభ్యులతో కలిసి చేసిన ఆ ట్రెక్ తనకు మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగించిందని వెల్లడించారు.
హిమాలయాల్లో ట్రెక్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక చిన్న కుక్కపిల్ల తమ వెంట రావడం మొదలైందని విస్మయ గుర్తుచేసుకున్నారు. దాదాపు ఏడు గంటలకు పైగా సాగిన ప్రయాణంలో ఒక దశలో తాము దారి కూడా తప్పిపోయామని చెప్పారు. అంతేకాదు తాగడానికి తీసుకెళ్లిన నీరు కూడా పూర్తిగా అయిపోయిందని వెల్లడించారు. చివరకు ఎంతో కష్టపడి తర్వాతి గ్రామానికి చేరుకున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నామని, ఆశ్చర్యకరంగా ఆ చిన్న కుక్కపిల్ల ప్రయాణం మొత్తం తమతోనే కలిసి నడిచిందని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు చూసినా, ఆ హిమాలయ యాత్ర తన మనసుకు అత్యంత దగ్గరగా నిలిచిందని ఆమె భావోద్వేగంగా వివరించారు.
ప్రయాణాల విషయంలో తాను, తన సోదరుడు ప్రణవ్ పూర్తిగా భిన్నమైన వ్యక్తులమని కూడా విస్మయ చెప్పారు. ప్రణవ్ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాడని, బయలుదేరిన తర్వాతే ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో నిర్ణయించుకుంటాడని అన్నారు. గమ్యస్థానానికి చేరుకున్నాకే బస గురించి ఆలోచించడం కూడా అతనికి అలవాటేనని చెప్పారు. అలా వెళ్తేనే జర్నీలో కిక్ ఉంటుందని ప్రణవ్ భావిస్తాడని ఆమె పేర్కొన్నారు.
తాను మాత్రం పూర్తిగా భిన్నమని విస్మయ నవ్వుతూ చెప్పారు. ప్రయాణానికి ముందే ప్రతి చిన్న విషయాన్ని ప్లాన్ చేసుకోవడం తనకు అలవాటని, ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్లాలి, ఏం చేయాలి అన్న ప్రతిదీ ముందుగానే సిద్ధం చేసుకుంటానని వివరించారు. ప్రణవ్ చాలా తక్కువ లగేజ్ తో ప్రయాణం పూర్తి చేస్తే, తాను మాత్రం ఎక్కువ కంఫర్ట్ వస్తువులతోనే ప్రయాణించడానికి ఇష్టపడతానని చెప్పారు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేర్వేరైనా, కలిసి చేసిన ప్రయాణాలు మాత్రం ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చాయని పేర్కొన్నారు.
నటనకు ముందే విస్మయ రచయిత్రిగా, కవయిత్రిగా తన టాలెంట్ ను చాటుకున్నారు. మార్షల్ ఆర్ట్స్పై కూడా ఆమెకు మంచి ఆసక్తి ఉంది. ఇప్పుడు ‘తుడక్కం’ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అఖిల్ కృష్ణ, లినీష్ నెల్లిక్కల్ స్క్రీన్ప్లే అందించగా, ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నటిగా తొలి అడుగు వేయబోతున్న సమయంలో విస్మయ పంచుకున్న ఈ జర్నీ జ్ఞాపకాలు అభిమానుల్లో ఆమెపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.