
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం జులై 10న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే అఖిల్ కెరీర్లో ఫస్ట్ రూ.వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు ఇంటింటా ప్రేక్షకులను అలరించేందుకు ఆగస్టు 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘ఆగస్టు నా బర్త్డే మంత్. థియేటర్లలో ‘లెనిన్’కు ప్రేక్షకులు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి ఈ సినిమా మీ ఇంటికే వస్తోంది. కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. 90వ దశకంలో చిత్తూరు జిల్లా నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో అఖిల్ రా అండ్ రస్టిక్ పాత్రలో ఆకట్టుకోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. మురళి కిషోర్ అబ్బూరు కథ, కథనం, దర్శకత్వం, తమన్ అందించిన సంగీతం, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందుతుందని మూవీ టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.