
Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో భారీ చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళలకు అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు రాత్రికి రాత్రే పరారవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
స్థానికంగా శిరీష, సాంబశివరావు దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కాలనీలోని పలువురు మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. శిరీష ‘సాయి గణేష్ టెక్స్ టైల్స్’ పేరుతో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తూ.. అదే సమయంలో చిట్టీల వ్యాపారం కూడా సాగించినట్లు తెలుస్తోంది. స్థానికుల నమ్మకాన్ని సంపాదించి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు.
బాధితుల కథనం ప్రకారం.. దంపతులు కాలనీలో ఉన్న తమ సొంత ఇంటిని అమ్మేసి, ఆ తర్వాత ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.