
ఆరంభంలో ఆశలు అడియాసలు చేసినా, మలివిడతలో పలకరించి రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన 2026 వర్షపాత గణాంకాలు వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిస్తున్నాయి. జూన్ నెలలో తీవ్ర వర్షభావం నెలకొన్నప్పటికీ, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు ఊపందుకోవడంతో సాగు పనులు వేగవంతమయ్యాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 35.4శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే జూలై రాకతో పరిస్థితులు పూర్తిగా మారాయి. జూలై నెలలో దేశవ్యాప్తంగా 283.3 మిమీ వర్షపాతం నమోదై, సాధారణ స్థాయిని దాటింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో జూలైలో సాధారణం కంటే 33శాతం అదనంగా వర్షాలు కురిశాయి.
ఆగస్టు ఆరంభంలో దక్షిణాదికి వర్షాల పండగ
ఆగస్టు మొదటి రెండు రోజుల్లోనే వాతావరణం మరింత అనుకూలంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఆగస్టు 1, 2 తేదీలలో ఏకంగా 71శాతం అదనపు వర్షపాతం నమోదైంది. ఇది నాట్లు వేయడానికి, విత్తనాలు చల్లుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులకు ఎంతో మేలు చేకూర్చింది.
ప్రాంతాల వారీగా మొత్తం సీజన్ వర్షపాతం
మధ్య భారతదేశం: 542.2 మిమీ కురిసింది. 5.7శాతం అదనపు వర్షపాతంతో కళకళలాడుతుంది.
దక్షిణ భారతదేశం: జూన్ లోటును భర్తీ చేసుకుంటూ 303.7 మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది. 19.9శాతం లోటు ఉన్నప్పటికీ ఆగస్టు వర్షాలతో ఇది మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తం దేశం: ఇప్పటివరకు 410.1 మిమీ వర్షపాతం నమోదైంది.
జూన్ నెలలో ఏర్పడిన వర్షపాత లోటును జూలై, ఆగస్టులలో కురుస్తున్న వర్షాలు శరవేగంగా భర్తీ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండటంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.
