Reading Time: 2 minutes
యుద్ధంలో AI తంత్రం..  చైనా భీకర వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!

భవిష్యత్తు యుద్ధ రంగం మునుపెన్నడూ లేనంత వేగంగా మారుతోంది. ఇకపై యుద్ధాలు కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లతోనే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తియుక్తులతోనూ జరగనున్నాయి. ఆధునిక యుద్ధ తంత్రంలో చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచానికి తొలిసారిగా తన ‘AI-ఎనేబుల్డ్ ఇంటెలిజెంట్ స్ట్రైక్-ప్లానింగ్ సిస్టమ్’ను ప్రదర్శించింది. డెంగ్ జియాన్‌పింగ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.. యుద్ధ సమయంలో అత్యంత వేగంగా దాడుల ప్రణాళికను రూపొందించడంలో, వందలాది సైనిక యూనిట్లను ఒకే తాటిపై సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరికొత్త ‘స్మార్ట్ స్ట్రైక్’ సిస్టమ్‌ను ప్రదర్శించడం ద్వారా చైనా తన కపట బుద్ధిని చాటుకోగా.. భారత్ కూడా తనదైన శైలిలో 129 AI ప్రాజెక్టులతో బలమైన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

చైనా ‘స్మార్ట్ స్ట్రైక్’ ప్రత్యేకతలు:

కేవలం నిఘా (Surveillance) లేదా డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా, ఈ AI నేరుగా ‘స్ట్రైక్ ప్లానింగ్’, ‘మల్టీ-యూనిట్ కోఆర్డినేషన్’కు ఉపయోగిస్తున్నారు.

ఒకే సమయంలో 100 కంటే ఎక్కువ వ్యూహాత్మక యూనిట్లను సమన్వయం చేస్తూ, కచ్చితమైన లక్ష్యాలపై దాడులు (Precision Firepower) చేసేలా దీన్ని రూపొందించారు.

యుద్ధ సమయంలో కమాండర్లు తీసుకునే నిర్ణయాల వేగాన్ని (Decision-making Speed) పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.

భారత్‌కు ఎందుకు హెచ్చరిక?

ఎల్ఏసీ (LAC) వెంబడి చైనా ఇప్పటికే డ్రోన్లు, శాటిలైట్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌ను మోహరిస్తోంది. ఇప్పుడు ఈ AI-ఆధారిత కోఆర్డినేషన్ సిస్టమ్‌తో చైనా తన దూకుడును పెంచాలని చూస్తోంది. శత్రువుల కదలికలను గుర్తించి, క్షణాల వ్యవధిలో దాడులు చేసేలా “చూడు-అర్థం చేసుకో-నిర్ణయం తీసుకో-దాడి చేయి” (Observe, Orient, Decide, Act – OODA Loop) ప్రక్రియను చైనా మరింత వేగవంతం చేస్తోంది.

దీటుగా బదులిస్తున్న భారత్!

చైనా కుట్రలను తిప్పకొట్టేందుకు భారత్ కూడా రక్షణ రంగంలో AI టెక్నాలజీని విస్తృతంగా వాడుతోంది.

ఇటీవలి ‘ఆకాశ్‌తీర్’ (AkashTeer) వ్యవస్థ విజయవంతం కావడంతో, రక్షణ రంగంలో ఏకంగా 129 డిఫెన్స్ AI ప్రాజెక్టులకు భారత్ ఆమోదం తెలిపింది.

కేవలం ఆయుధాల సంఖ్యే కాకుండా.. సెన్సార్లు, డ్రోన్లు, కమాండ్ సెంటర్లు అన్నీ ఒకదానితో ఒకటి వేగంగా అనుసంధానమయ్యేలా ‘నెట్‌వర్క్-సెంట్రిక్ వార్‌ఫేర్’ వైపు భారత్ అడుగులు వేస్తోంది.

నిఘా, అటానమస్ సిస్టమ్స్, సైబర్ – ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో దేశీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటోంది.

భవిష్యత్తులో సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు కేవలం ఆయుధాల మధ్య మాత్రమే జరగవు. ఏ దేశపు AI నెట్‌వర్క్ వేగంగా, కచ్చితంగా స్పందిస్తుందనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. చైనా కొత్త వ్యూహాలకు భారత్ తనదైన స్వదేశీ సాంకేతికతతో గట్టి పోటీ ఇస్తుండటం విశేషం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..