Reading Time: 2 minutes
Moeen Ali Picks Ashish Nehra Over Ms Dhoni As Best Cricket Brain Heres Why

Moeen Ali Names India Best Cricketing Brain: క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ (అత్యుత్తమ వ్యూహకర్త) ఎవరు అని అడిగితే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. చురుకైన నిర్ణయాలు, అసాధారణ కెప్టెన్సీతో ధోనీ ఎన్నో విజయాలను భారత జట్టుకు అందించాడు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాత్రం బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్‌గా మహీని కాకుండా.. టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేశాడు. అలీ ఎంపిక ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ముందుగానే అంచనా వేసే సామర్థ్యం:

‘బియర్డ్ బిఫోర్ వికెట్’ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మొయిన్ అలీ.. బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అంటే ఆటలో వచ్చే ప్రతి పరిస్థితిని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం ఉండాలని చెప్పాడు. ‘బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అంటే.. ఏ పరిస్థితిలో ఏమి చేయాలి, ఎందుకు చేయాలి, ప్రత్యర్థి ఎలా ఆలోచిస్తాడు, మ్యాచ్ ఎలా మలుపు తిరుగుతుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చెప్పే ప్రతి విషయానికి డేటా లేదా గత అనుభవాల ఆధారాలు కూడా ఉండాలి. క్రికెటింగ్ బ్రెయిన్ అంటే నాకు ఆశిష్ నెహ్రానే గుర్తొస్తాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న సమయంలో రెండేళ్ల పాటు ఆయనతో కలిసి పనిచేశాను. నెహ్రాకు ఆటపై అద్భుతమైన అవగాహన ఉంది. జట్టులో మంచి వాతావరణం ఎలా సృష్టించాలో, ఆటగాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో, కోచ్‌లతో ఎలా సమన్వయం చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. నెహ్రా నిజంగా అద్భుతమైన క్రికెట్ మేధావి’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్:

భారత్ తరఫున ఆశిష్ నెహ్రా 120 వన్డేల్లో 157 వికెట్లు, 17 టెస్టుల్లో 44 వికెట్లు, 27 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టి గుజరాత్ టైటాన్స్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్‌లోనే జట్టును ఛాంపియన్‌గా నిలిపి తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి గుజరాత్ టైటాన్స్‌తోనే నెహ్రా కొనసాగుతున్నాడు. 2026లో కూడా ఐపీఎల్ ఫైనల్ ఆడింది. అయితే ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు:

మరోవైపు ఎంఎస్ ధోనీని ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ మేధావుల్లో ఒకరిగా అభిమానులు, మాజీలు భావిస్తారు. 350 వన్డేల్లో 10773 రన్స్, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 రన్స్ చేశాడు. ప్రపంచ కప్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను నంబర్-1గా నిలిపాడు. మహీని బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఆశిష్ నెహ్రాను అత్యుత్తమ క్రికెటింగ్ బ్రెయిన్‌గా మొయిన్ అలీ ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అలీ చెప్పినట్లుగా ఆటపై లోతైన అవగాహన, పరిస్థితులకు తగ్గ వ్యూహాలు రూపొందించే సామర్థ్యం నెహ్రాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.