Reading Time: 2 minutes

రేవంత్‌రెడ్డి చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారు

పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉంది

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని, ఫేజ్ -1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను మాత్రమే చూపించిందని అన్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ఈ ప్రాజెక్టుకు రూ. 5,641 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయితే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 1,400 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, సిఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. అవసరమైతే హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాళాలను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా …? అంటూ ధ్వజమెత్తారు. హైడ్రా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. తాను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, హైడ్రా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. హైడ్రా చేసిన ట్వీట్లు వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి వ్యవహారం చిన్న మోదీలా ఉంది

గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు, రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే ప్రభుత్వం, సిఎం ఇంటి నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇళ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని వ్యాఖ్యానించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నగరంలోని 16 నాళాల నుంచి మురికి నీరు మూసీలోకి వస్తోందని, నగర వ్యర్థాలన్నీ మూసీలోకే వెళ్తున్నాయని తెలిపారు. 1,430 ప్రాపర్టీలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని, దీనితో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని, అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాను, విశారదన్ కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఖమ్మంలో పర్యటిస్తామని కవిత తెలిపారు. వెలుగుమట్లలో నిజమైన బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తాను, విశారదన్ కలిసి చేసిన పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆమె పేర్కొన్నారు.