Reading Time: < 1 minute

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో షాదీ ముబారక్ అద్బుతంగా మొదలైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ కిట్ సహా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం అని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పేద ముస్లింలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. హరీష్ రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాలను నిండా ముంచారని, సిఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే లక్ష ఇండ్లను కూల్చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో రేవంత్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ విధ్వంసమైపోయాయని, ప్రజలకు ఉపాధి కూడా కరువైందని, మాటలు చెప్పడం తప్ప చేతల్లో రేవంత్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కరోనా టైంలోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ అని హరీష్ రావు కొనియాడారు.